హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా సుమారు 1,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు అందజేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వరద నష్టంపై ప్రాథమిక అంచనాలను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి బుధవారం నివేదిక పంపించింది. వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకొనిపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖకు రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీరాజ్ శాఖకు రూ.449 కోట్లు, సాగునీటి శాఖకు రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్తుశాఖకు రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల్లో పేర్కొన్నాయి. ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు బాధితులను తరలించే క్రమంలో రూ.25 కోట్లు, ఇంకా ఇతర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ.1,400 కోట్ల మేరకు వరద నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి పంపిన నివేదికలో వివరించారు.