హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలలో 14 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్ నుంచి గుణ, జబల్పూర్, పెండ్రా, ఝూర్సుగూడ, గోపాల్పూర్ మీదుగా నైరుతిని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది.
ఆవర్తనం దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావం తెలంగాణపై బాగా ఉన్నది. దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లను వాతావరణ కేంద్రం సూచించింది