జగిత్యాల రూరల్, జూలై 23: దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తున్నారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో హైదరాబాద్లో మాత్రమే స్టడీ సర్కిల్ ఉండగా 80 శాతం మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారే ఉండేవారని, ప్రస్తుతం జిల్లాకు నాలుగు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
జగిత్యాల స్టడీ సర్కిల్ నిరుపేద విద్యార్థులకు వరంగా మారిందని పేర్కొన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం 2,440 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, జోనల్ వ్యవస్థను మార్చి ఏ జిల్లా పోస్టును ఆ జిల్లా అభ్యర్థులకే కేటాయించడం జరిగిందని తెలిపారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కలెక్టర్ జీ రవి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.