హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో అర్చకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.130 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖకు మొత్తం రూ.618 కోట్లు కేటాయించగా, దేవాలయాలకు సహాయం కింద రూ.250 కోట్లు, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి మరో రూ.200 కోట్లు కేటాయించారు. వైటీడీఏ నిధులు సహా సీజీఎఫ్, బోనాల పండుగ, అర్చకులు, ఉద్యోగుల వేతనాలు మొదలైన వాటికి కలిపి కేటాయించారు. యాదాద్రిలో యాత్రికుల కోసం సత్రాలు, పార్కింగ్ సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి నిరుడు రూ.350 కోట్లు కేటాయించగా, ఈసారి పనులు చాలా వరకు పూర్తికావడంతో రూ.200 కోట్లు కేటాయించారు.
దేవాదాయ శాఖ కేటాయింపులు(రూ.కోట్లలో)
యాదాద్రి ఆలయ అథారిటీకి :200.00
ఇతర ఆలయాలకు సహాయం :250.00
కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) :23.75
అర్చకులు, ఉద్యోగుల వేతనాలు :130.00
బోనాలు పండుగ : 15.00
మొత్తం : 618.75