హైదరాబాద్ : ఉగ్రవాదుల కాల్పులకు బెదరని గురుగు హిమప్రియకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు వరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో గురుగు హిమప్రియకు ప్రధాని మోదీ ఈ అవార్డును అందజేశారు.
13 ఏండ్ల గురుగు హిమప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీ జవాన్. ఈ కుటుంబం జమ్మూ ప్రాంతంలోని ఆర్మీ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. అయితే 2018, ఫిబ్రవరి 10న ఉదయం 5 గంటల సమయంలో ఆర్మీ క్వార్టర్స్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తూటాల వర్షం కురిపించారు. ఈ సమయంలో హిమప్రియ తండ్రి ఇంట్లో లేరు. 60 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే హిమప్రియ తండ్రిలా ఒక్కసారి ధైర్యసాహసాలు ప్రదర్శించింది. ఆమె దెబ్బలు తగిలినా కూడా బెదరకుండా, ఉగ్రవాదులకు ఎదురెళ్లి.. స్థానికులను ప్రాణాలతో రక్షించింది. దీంతో గురుగు హిమప్రియ ధైర్యాన్ని కేంద్ర రక్షణ శాఖ అభినందించింది. హిమప్రియ సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని పొన్నం గ్రామం.
మొత్తం ఆరు విభాగాలలో(ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ,ధైర్యసాహసాలు, స్కూల్ అండ్ ఎడ్యుకేష్ కి సంబంధించిన) అసాధారణ విజయాలు సాధించిన పిల్లలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందజేస్తోంది. బాల శక్తి పురస్కారం యొక్క వివిధ కేటగిరీల కింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 29 మంది పిల్లలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, నగదు బహుమతి రూ. 1 లక్షతో పాటు సర్టిఫికేట్ ను అందజేస్తారు. నగదు బహుమతిని అవార్డు గ్రహీతల సంబంధిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.