హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్కు విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా హుకుం జారీచేయడం విడ్డూరంగా ఉన్నది. ఏపీ చెప్పగానే తెలంగాణకు గుడ్డిగా ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం.. ఎవరు ఎవరికి చెల్లించాలన్న దానిపై కొంచెం కూడా ఆలోచించలేదు. ఏపీకి డబ్బులు చెల్లించాలని నిర్దేశించిన కేంద్రం.. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలపై మాట్లాడకపోవడం గమనార్హం.
ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం రాసిన లేఖపై తెలంగాణ విద్యుత్తు సంస్థలు తీవ్రంగా స్పందించాయి. ‘మాకు ఏపీ నుంచి విద్యుత్తు బకాయిలు రావాల్సి ఉన్నది. వాటినుంచి మేము ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను మినహాయించుకొంటే.. మాకే సుమారు రూ.12,940 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది’ అని గణాంకాలతో సహా బయటపెట్టాయి. కేంద్రం నిజంగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించాలనుకొంటే.. ఇరు పక్షాల నుంచి గణాంకాలను తెప్పించుకొని, ఎవరు ఎవరికి చెల్లించాలనేది తేల్చాలి.
అలా కాకుండా ఏకపక్షంగా, వివక్షాపూరితంగా తెలంగాణ విద్యుత్తు సంస్థలు 30 రోజుల్లో విద్యుత్తు బకాయిలను ఏపీ విద్యుత్తు సంస్థలకు చెల్లించాలంటూ ఏకంగా ఆర్డరు పాస్ చేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏపీ చెల్లించాల్సిన బకాయిల మాటేంటనే సూటి ప్రశ్నకు అటువైపు నుంచి సమాధానం రావడం లేదు. నిజానికి రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఏపీ ఉద్దేశపూర్వకంగానే పీపీఏలను పట్టించుకోకుండా.. థర్మల్ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేయకుండా నిలిపివేసింది.
దీనితో ఆ లోటును పూడ్చుకునేందుకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును తెలంగాణ కొనుగోలు చేసింది. దీనివల్ల కలిగిన అదనపు భారానికి సంబంధించి బకాయిలు ఏపీ నుంచి రావాల్సి ఉన్నది. అలాగే జల విద్యుత్తు సరఫరాను, మాచ్ఖండ్, టీబీ డ్యాం నుంచి రావాల్సిన విద్యుత్తును కూడా నిలిపివేయడంతో అది తెలంగాణపై అదనపు భారంగా పరిణమించింది. ఈ మొత్తం సుమారు రూ.6639 కోట్లు (వడ్డీతో కలిపి) బకాయిలను ఏపీ విద్యుత్తు సంస్థలు తెలంగాణకు చెల్లించాల్సి ఉన్నది.
తెలంగాణ విద్యుత్తు సంస్థలు విడుదల చేసిన (31.12.2021 నాటికి) బకాయిల చిట్టాను పరిశీలిస్తే.. తెలంగాణ విద్యుత్తు సంస్థలకే ఏపీ విద్యుత్తు సంస్థలు రూ.12,940 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని తేటతెల్లమైంది. నిజానికి రాష్ట్ర విభజన సమయంలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వడ్డీతో కలుపుకొంటే.. రూ.3,819 కోట్లు ఉన్నది. అలాగే పవర్ పర్చేజ్కు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.6,639 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇందులో రూ.2,423 కోట్ల వడ్డీకూడా ఉన్నది.
ఏపీ ట్రాన్స్కో నుంచి రూ.1,267 కోట్ల అసలు, రూ.463 కోట్ల వడ్డీ కలుపుకొంటే.. రూ.1,730 కోట్లు రావాలి. దీనితోపాటు ఏపీ జెన్కో నుంచి తెలంగాణకు రూ.4,026 కోట్లు రావాలి. ఇందులో రూ.954 కోట్ల వడ్డీ ఉన్నది. దీనికి అదనంగా.. కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్ట్కు సంబంధించి ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.1,614 కోట్లు రావాల్సి ఉన్నది. ఇవన్నీ కలుపుకొంటే.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు మొత్తం రూ.17,828 కోట్లు రావాలి. అలాగే తెలంగాణ విద్యుత్తు సంస్థలు.. ఏపీ విద్యుత్తు సంస్థలకు రూ.4,887 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది.
ఈ మొత్తాన్ని మినహాయించుకుంటే.. ఏపీ విద్యుత్తు సంస్థలే రూ.12,940 కోట్లను తెలంగాణ విద్యుత్తు సంస్థలకు చెల్లించాల్సి ఉన్నదనేది స్పష్టం. కానీ ఈ గణాంకాల జోలికి వెళ్లకుండా.. కేవలం ఏపీకి మీరు చెల్లించాల్సినవి చెల్లించండంటూ తెలంగాణకు హుకుం జారీచేయడం గమనార్హం. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న బకాయిల వివాదాన్ని పరిష్కరించాల్సిన కేంద్రం ఏకపక్షంగా.. ఒకవైపు మాటలు వింటూ.. తెలంగాణపై జులుం ప్రదర్శించేలా 30 రోజుల్లోనే బకాయిలు చెల్లించండి అంటూ ఆదేశించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఫాసిస్టు ధోరణికి నిదర్శనంగా చెప్పవచ్చు.