Jubleehills by Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 127 పోలింగ్ కేంద్రాల్లో 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో భాగంగా 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తై పోయిందన్నారు.
ఇక జూబ్లీహిల్స్ బై పోల్ నేపథ్యంలో నేడు నియోజకవర్గానికి కేంద్ర బలగాలు రానున్నాయి. ఏడు కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 1600 మంది లోకల్ పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు చేసిన ఖర్చుల రిజిస్టర్ను ఎన్నికల వ్యయ పరిశీలకులకు చూపించాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీఆర్ఎస్ తరపున ఆయన సతీమణి మాగంటి సునీత, కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ తరపున దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. నిరుద్యోగుల తరపున మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆస్మా కూడా పోటీలో ఉన్నారు. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది.