ఖైరతాబాద్, డిసెంబర్ 27 : రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగలకు జనాభా దామాషా ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదిగలకు 7 శాతం రిజర్వేషన్లు కావాలని మందకృష్ణ మాదిగ కాలంచెల్లిన డిమాండ్ చేస్తున్నాడని, దాంతో మాదిగల కష్టాలు తీరవని అన్నారు. రాష్ర్టాలే రిజర్వేషన్లు పెంచుకునేలా కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సైతం తీర్పును వెలువరించాలని, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చొరవ తీసుకోవాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టేవిధంగా సహకరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఐక్య సంఘాలతో మాదిగ యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జనవరి మొదటి వారంలో సమావేశం నిర్వహించి మాదిగలను చైతన్య పరుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు, మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ ముత్యపాగ నర్సింగరావు, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడ్డ యాదన్న తదితరులు పాల్గొన్నారు.