హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ దేశం గర్వపడేలా ఉన్నదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో మేళవించి ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ను రూపొందించారని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధరంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, విజయడెయిరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి సమాఖ్య చైర్మన్ జీ జితేందర్రెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావుతో కలిసి తలసాని విలేకరులతో మాట్లాడారు. బర్రెలు, గొర్ల పంపిణీకి బడ్జెట్లో నిధులు కేటాయించటమే కాకుండా మూడు లక్షల గొర్ల యూనిట్ల పంపిణీకి త్వరలోనే విధివిధానాలు రూపొందించనున్నట్టు ఆయన వెల్లడించారు. గొర్ల పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కళ్లుండి చూడలేని విపక్షాలు
బడ్జెట్పై విపక్షాలు చేస్తున్న వాదన అసంబద్ధంగా ఉన్నదని, వాళ్లు కళ్లుండి చూడలేని దుస్థితిలో ఉన్నారని తలసాని విమర్శించారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమపై ఆధారపడిన 12 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉన్నట్టు బడ్జెట్ స్పష్టంచేసిందని తెలిపారు. రూ.30 కోట్ల నష్టాల్లో ఉన్న విజయ డెయిరీకి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాల ఫలితంగా ప్రస్తుతం రూ.60 కోట్ల లాభాల్లో నడుస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం డెయిరీ టర్నోవర్ రూ.600 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. రాష్ట్రంలోని పాడి రైతులకు గతంలో ప్రకటించిన రూ.39 కోట్ల ప్రోత్సాహాన్ని విడుదలచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం లీటరుకు పాడిరైతులకు ప్రకటించిన నాలుగు రూపాయల రాయితీలో.. తాము ఒక్కరూపాయి భరిస్తామని విజయ డెయిరీ ముందుకురావడం అభినందనీయమని చెప్పారు. త్వరలో విజయ డెయిరీ ఔట్లెట్లను 1000కి పెంచుతామని పేర్కొన్నారు. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఎస్ వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచి తీరుతారని తలసాని దీమా వ్యక్తంచేశారు.