అమీర్పేట్, జూన్ 1: అవయవాలు సరిగా ఆకారం దాల్చకుండా పుట్టిన పాపను 112 రోజుల పాటు న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్ఐసీయూ) లో ఉంచి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించారు సనత్నగర్లోని ఈఎస్ఐసీ దవాఖాన వైద్యులు. మేడ్చల్కు చెందిన వినోద్ కుమార్ భార్య రూబీదేవికి అప్పటికే 7 సార్లు గర్భస్రావమైంది. ఎనిమిదోసారి గర్భం దాల్చి నా తీవ్ర గైనిక్ సమస్యతో బాధపడింది. 18 వారాల గర్భంతో సనత్నగర్లోని ఈఎస్ఐసీ దవాఖానలో చేరింది.
ఆమె ఆరోగ్యాన్ని అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ అపరాజిత డిసౌజా నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షించింది. 27వ వారంలో ఆమె పాపకు జన్మనిచ్చింది. ఆ పాప బరువు 710 గ్రాములే. అవయవాలు పూర్తిగా ఆకారం దాల్చలేదు. పాపను వెంటనే ఎన్ఐసీయూ లో ఉంచి పీడియాట్రిక్స్ విభాగం హెచ్వోడీ డాక్టర్ కోదండపాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మ ణ్యం పర్యవేక్షణలో వైద్య బృందం చికిత్స అందించింది. 112 రోజులు పాపను కంటికి రెప్పలా కాపాడి బరువును 1.95 కిలోలకు పెంచి, ఆరోగ్యవంతురాలిని చేశారు. బుధవారం ఆ పాపను డిశ్చార్జి చేశారు. ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ సూరింటెండెంట్ డాక్టర్ కల్యాణ్కుమార్ పాల్ సహా వైద్య బృందానికి వినోద్ కుమార్, రూబీదేవి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.