హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో జాతీయ, రాష్ట్ర రహదారుల వద్ద 11 జంక్షన్లను జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదించింది. అలాగే, రీజినల్ రింగ్ రోడ్డు వెంట ఉన్న జడ్పీ, పంచాయతీరాజ్, పంట పొలాల వద్దకు వెళ్లే రోడ్ల వద్ద స్థానికుల రాకపోకలకు వీలుగా అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ జంక్షన్లు సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, తుర్కపల్లి, భువనగిరి సమీపంలో హైదరాబాద్-వరంగల్, చౌటుప్పల్, కీసర-యాదాద్రి రహదారిపై, గజ్వేల్-యాదాద్రి రహదారిపై రెండు చోట్ల, సంగారెడ్డి దాటిన తరువాత 161 జాతీయ రహదారిపై ఇంటర్ చేంజ్ కోసం వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఆర్ఆర్ఆర్ను పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్న నేపథ్యంలో జంక్షన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఏర్పడింది. డీపీఆర్ తరువాత వీటిపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.