JEE Main | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేదని మరోమారు నిరూపించారు. జాతీయంగా 43 మంది వంద పర్సంటైల్ సాధిస్తే.. వారిలో 11 మంది తెలంగాణ విద్యార్థులు ఉండటం విశేషం. మన పొరుగునే ఉన్న ఏపీ, రాజస్థాన్ నుంచి ఐదుగురు, యూపీ నుంచి నలుగురు, గుజరాత్, కర్ణాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ నుంచి ఇద్దరు మాత్రమే వంద పర్సంటైల్ను సాధించారు. మొత్తంగా వంద పర్సంటైల్ సాధించినవారిలో 25 శాతం మంది తెలంగాణ విద్యార్థులుండటం విశేషం.
జాతీయంగా మరే రాష్ట్రం తెలంగాణ తరహాలో ప్రతిభను చూపలేదు. హైదరాబాద్లోని విజయ్నగర్కాలనీకి చెందిన సింగరాజు వెంకట కౌండిన్య 100 పర్సంటైల్తో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. అల్లం సుజయ్, వావిలాల చిద్విలాస్రెడ్డి తదుపరి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ, బీటెక్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్-1, ఏప్రిల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాలను క్రోడీకరించి తుది ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. రెండు సెషన్లకు అమ్మాయిలు 3,38,963, అబ్బాయిలు 7,74,359, థర్డ్ జెండర్లు ముగ్గురు.. మొత్తంగా 11,13,325 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి తుది ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది.
భారీగా పెరిగిన కటాఫ్ మార్కులు
జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కులు గతంతో పో ల్చితే అన్ని క్యాటగిరీల్లో ఈ ఏడా ది గణనీయంగా పెరిగాయి. పేపర్లు కఠినంగా రావడం, ప్రశ్నలు సంధించిన తీరు కారణం గా కటాఫ్ మార్కులు పెరిగినట్టుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓపెన్ కోటాలో గతేడాదితో పోల్చితే 2 మార్కులు పెరగగా, ఈడబ్ల్యూఎస్లో 12, ఓబీసీ ఎన్సీఎల్లో 6, ఎస్సీ 8, ఎస్టీ కోటాలో ఏకంగా 11 కటాఫ్ మార్కులు పెరగడం విశేషం. ఇక అడ్వాన్స్డ్ అర్హత సాధించినవారిలో ఓపెన్ కోటావారే అధికంగా ఉన్నారు. ఆ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ క్యాటగిరీ విద్యార్థులు ఉన్నారు.
గురుకులాల సత్తా
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ/శేరిలింగంపల్లి: ఐఐటీ జేఈఈ పరీక్షల్లో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటా రు. ఈ ఏడాది గురుకులాల నుంచి 2,181 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,181 మంది (దాదాపు 60 శాతం) అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. ఇందులో అఖిల భారత స్థాయిలో 56 మంది 90 పర్సంటైల్కుపైగా, 256 మంది విద్యార్థులు 80 పర్సంటైల్కుపైగా సాధించారు. గౌలిదొడ్డి సాంఘిక, సంక్షేమ బాలుర గురుకుల ఐఐటీ అకాడమీ నుంచి మొత్తం 95 మంది పరీక్షకు హాజరుకాగా, 80 మంది అర్హత సాధించారు. 15 మంది విద్యార్థులు 90 శాతం, 40 మంది విద్యార్థులు 80 శాతం పర్సంటైల్ సాధించినట్టు ప్రిన్సిపాల్ పాపరావు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రామకృష్ణ, రంజిత్, సాత్విక్ను అభినందించారు. తెలంగాణ గిరిజన గు రుకులాల ఐఐటీ స్టడీ సెంటర్ నుంచి జేఈఈ మెయిన్స్కు 67 మంది పరీక్షకు హాజరు కాగా 66 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తెలిపారు.
జేఈఈ కోసం రేయింబవళ్లు కష్టపడ్డా. ఊహించినట్టే వంద పర్సంటైల్ వచ్చింది. మనపై మనకు నమ్మకముంటే ఏదైనా సాధ్యమే. కాలేజీలో లెక్చరర్లు చెప్పినట్టు సిస్టమ్స్ను ఫాలో అవుతూ.. శ్రద్ధగా చదవడం వల్లే మొదటి ర్యాంకు వచ్చింది. లెక్చరర్లు, తల్లిదండ్రులు అంతా సహకరించారు. అడ్వాన్స్డ్లో మంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ బీటెక్లో చేరుతా. భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
– సింగరాజు వెంకట కౌండిన్య
టెక్నాలజీ అభివృద్ధి చేస్తా
మా స్వస్థలం నా గర్కర్నూల్ జిల్లా అ చ్చంపేట. మా అ మ్మానాన్న టీచర్లే. హై దరాబాద్లో స్థిరప డ్డాం. అన్న రుషికేశ్ బిట్స్పిలానిలో చదువుతున్నారు. నేను టైం వేస్ట్ చేయ కుండా మెయిన్స్కు ప్రిపేరయ్యా. వంద పర్సంటైల్, మంచి ర్యాంక్ సాధించా. ఐఐటీ ముంబైలో చదువుతా. మల్టీనేషనల్ కంపెనీలోనే చేరి, సాంకేతికతను అభివృద్ధిచేస్తా.
– వావిలాల చిద్విలాస్రెడ్డి
ఎయిర్ స్పేస్లో రాణిస్తా
ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా జేఈ ఈ అడ్వాన్స్డ్పైనే. మంచి ర్యాంక్ సా ధించి, బాంబే ఐఐటీలో చేరుతా. ఎయిరోస్పేస్లో రాణించాలని అనుకుంటున్నా. రాకెట్స్, రిసె ర్చ్ రంగంపై దృష్టిసారించాలనుకుంటున్నా. బీటెక్ పూర్తిచేసి ఈ రంగంలో పరిశోధనలు చేస్తా.
– గుత్తికొండ అభిరామ్
ఐఐటీ బాంబేలో చేరుతా
నాన్న సాప్ట్వేర్ ఇం జినీర్, అమ్మ అకౌంటెంట్. మేమంతా హైదరాబాద్లోని మదీనగూడలో ఉం టాం. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. కంప్యూటర్ సైన్స్లో చేరి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నా. అమ్మానాన్నలు, లెక్చరర్లు ఎంతగానో సహకరించారు. ప్రాక్టీస్ టెస్ట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
– బిక్కన అభినవ్
జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు అఖండ విజయం సాధించినట్టు ఆ సంస్థ యాజమాన్యం శనివారం ప్రకటించింది. డీ ఫణింద్రనాథ్రెడ్డి 5వ ర్యాంకు, ఆర్ గ్రేస్ ఏంజెల్బాయ్ 5వ ర్యాంకు, ఎం అవినాశ్కుమార్ 10వ ర్యాంకు సాధించినట్టు వెల్లడించింది. వందలోపు 5, 5, 10, 12, 15, 18, 29, 32, 42, 47, 61, 70, 70, 72, 75, 77, 88, 88 వంటి 18 ర్యాంకులుకైవసం
చేసుకున్నట్టు వివరించింది.
కంప్యూటర్ సైన్స్లో చేరుతా
జేఈఈ ఫలితాల్లో వంద పర్సంటైల్ రా వడం సంతోషంగా ఉంది. అన్న పూర్ణ తేజ ఐఐటీ వారణాసిలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. లెక్చరర్లు, అన్న ఎంతో సహకరించారు. నాన్న హెచ్ఎం, అమ్మ టీచర్గా పనిచేస్తున్నారు. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబే, చెన్నైల్లో ఏదో ఒకదాంట్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేరుతా. ఎంబీఏ పూర్తిచేసి మంచి కంపెనీలకు సీఈవో కావాలన్నది నా లక్ష్యం. – రమేశ్ సూర్యతేజ
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్
జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ ఆదివారం నుంచి ప్రారం భం కానున్నది. జేఈఈ మెయిన్ ఫలితా లు విడుదల కావడంతో జేఈఈ-1, జేఈఈ-2లో రెండింటిలో నుంచి 2.5 లక్షల విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధిస్తా రు. ఆ విద్యార్థులు మే 7 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశమున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ 4న నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. రెండింటికి హాజరైన విద్యార్థుల ఫలితాలను మాత్రమే ప్రకటిస్తారు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.