హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి పరీక్షల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నా.. కఠినంగా వ్యవహరిస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకో చోట కాపీయింగ్ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. సిబ్బంది నిర్వాహకాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై వేటు వేస్తున్నారు. తాజాగా మంగళవారం పది మంది సిబ్బందిని పరీక్షల విధుల నుంచి తప్పించారు. వీరి స్థానంలో ఇతరులకు విధులు కేటాయించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో నాలుగు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ముగ్గురు ఇన్విజిలేటర్లను, చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్ట్మెంటల్ అధికారిని విధుల నుంచి తప్పించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో పర్యవేక్షణ లోపంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్, ఇదే కారణంతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట్ జడ్పీహెచ్ఎస్లో చీఫ్ సూపరింటెండెంట్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇన్విజిలేటర్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులను విధుల నుంచి తొలగించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆయా సిబ్బంది, అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు.
మంగళవారం ద్వితీయభాష పేపర్కు పరీక్ష నిర్వహించగా, స్కాడ్ తనిఖీల్లో ఐదుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిపై అధికారులు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. పరీక్షకు 4,94,426 మంది రెగ్యులర్ విద్యార్థులకు 4,92,967 మంది విద్యార్థులు (99.70) హాజరుకాగా, 1,459 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక ప్రైవేట్ విద్యార్థుల్లో (గతంలో ఫెయిలైనవారు) 400 మంది విద్యార్థులకు 214 మంది పరీక్ష రాసినట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.