SSC Exams | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాలు అదనంగా గ్రేస్ టైమ్ ఇచ్చారు. అంటే విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు పేపర్లు, ఇతరత్రా పత్రాలను వెంట తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే డిబార్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యేవారికి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశాన్నిచ్చింది. ఈ సౌకర్యాన్ని సెలవు రోజుల్లోనూ వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్తో ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 3 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. మొత్తంగా 9 రోజులపాటు స్పాట్ వాల్యుయేషన్ను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మార్చి 23న వాల్యుయేషన్ సిబ్బందికి ఓరియంటేషన్ను నిర్వహిస్తామని తెలిపారు. 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించడంతో జవాబు పత్రాల సంఖ్య తగ్గనున్నది. దీంతో మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.