హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో కొంతమంది టీచర్లు డిప్యూటేషన్లు, ఆన్డ్యూటీల కోసం ప్రయత్నిస్తున్నారు. కీలకమైన పదో తరగతి పరీక్షలకు ముందు తమ తమ ప్రయత్నాల్లో తలమునకలయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొంతమంది టీచర్లు ఆన్డ్యూటీలు, డిప్యూటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. సిఫారసు లేఖలు తీసుకొచ్చి అవకాశం కల్పించాలంటూ పైరవీలు చేస్తున్నారు. విద్యాశాఖకు వచ్చే వినతుల్లో ఆన్డ్యూటీలు, డిప్యూటేషన్లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇది చాలదంటూ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల నుంచి ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు తర్జభర్జన పడుతున్నారు.
తాకిడికి తట్టుకోలేక..
ఇటీవలికాలంలో విద్యాశాఖలో డిప్యూటేషన్లు, ఓడీలపై కొంతమందికి స్థానచలనం కల్పించారు. ఈ విషయం ఈ నోటా.. ఆ నోటా ఉపాధ్యాయవర్గాలకు పాకింది. దీంతో ఆశావహులు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓడీలు, డిప్యూటేషన్ల కోసం రోజు వచ్చే వారి తాకిడిని తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి మధ్యాహ్నం తర్వాత కార్యాలయంలో ఉండటం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జూన్లోనే..
టీచర్ల డిప్యూటేషన్లు, ఆన్డ్యూటీలు ఏమైనా ఉంటే జూన్లో చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభం కనుక ఈ సమయంలో ఇవ్వడం ఉత్తమమని భావిస్తున్నది. ఇటీవలే ఓ టీచర్ బదిలీ కోసమని ఉన్నతాధికారిని కలవగా, ఇప్పుడైతే వీలుపడదని, జూన్లో చేపడతామని చెప్పినట్టు తెలిసింది. అది కూడా డిప్యూటేషన్ లేదంటే ఆన్డ్యూటీ ఇస్తామే తప్ప బదిలీ సాధ్యంకాదని చెప్పినట్టు సమాచారం.