హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన 108 అంబులెన్స్లు, అమ్మఒడి (102 సర్వీస్) వాహనాలు, పార్థివ (హర్సె) వాహనాలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలు మొదటి నుంచి ఉన్నాయి. గర్భిణుల కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రత్యేకంగా అమ్మఒడి వాహనాలను 2017-18లో ప్రారంభించారు. పార్థివదేహాలను తరలించేందుకు ‘హర్సె’ వాహనాలను 2016-17లో ప్రవేశపెట్టారు.
ఈ మూడు రకాల వాహనాలు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు 1.03 కోట్ల మంది వీటి ద్వారా లబ్ధి పొందారు. 108, 102, హర్సె కలిపి ప్రస్తుతం 776 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా వైద్యారోగ్యశాఖ కొత్తగా 466 వాహనాలను కొనుగోలు చేసింది. ఇందులో 204 అంబులెన్సులు, 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలు ఉన్నాయి. వీటిని మంగళవారం హైదరాబాద్లోని నెక్లెస్రోడ్ వేదికగా ప్రారంభించనున్నారు. ఇందులో 437 వాహనాలను ప్రస్తుతం ఉన్నవాటిలో కాలం చెల్లిన వాహనాల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. వీటి రాకతో సేవల్లో వేగం, విస్తృతి మరింత పెరుగనున్నది.
అత్యవసర సేవలు మరింత విస్తృతం
రాష్ట్రంలో 108 అంబులెన్స్లు, అమ్మఒడి, హర్సె వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోయింది. వీటిని మార్చాలని, అవసరమైన చోట సేవలు విస్తరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 466 కొత్త వాహనాలను కొనుగోలు చేశాం. మూడు రకాల వాహనాలకు సరికొత్తగా బ్రాండింగ్ చేశారు. 108, 102 అనే హెల్ప్లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ ఫొటో, తెలంగాణ ప్రభుత్వ లోగో, ఉచిత సేవ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మఒడి వాహనాల వెనుకభాగంలో ‘అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో..’ అనే ట్యాగ్లైన్ ఆ వాహనాల పనితీరుకు అద్దం పడుతున్నది. కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా వైద్యసేవలు అందుతాయి.
– మంత్రి హరీశ్రావు
రోజుకు 1,456 మందికి సేవలు
అత్యవసర సమయాల్లో దవాఖానలకు చేర్చే 108 అంబులెన్స్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఆధునీకరించింది. ప్రస్తుతం 426 వాహనాలు ఉండగా, కొత్తగా 204 అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 175 వాహనాలను పాతవాటి స్థానంలో ప్రవేశ పెట్టనున్నారు. మరో 29 అంబులెన్స్లను కొత్త ప్రాంతాల్లో అందుబాటులోకి తేనున్నారు. 108 వాహనాల ద్వారా రోజుకు సగటున 1,456 మందికి ఎమర్జెన్సీ సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం 108కు ఫోన్ చేసిన తర్వాత సగటున 15-20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంటున్నది. కొత్త వాహనాల రాకతో వెయిటింగ్ సమయం మరింత తగ్గనున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండాలి. రాష్ట్రంలో 80 వేల జనాభాకు ఒక అంబులెన్స్ ఉన్నది.
సంవత్సరం : ఎమర్జెన్సీ సేవలు పొందినవారు
2014-15 : 4,64,128
2015-16 : 4,72,929
2016-17 : 4,78,929
2017-18 : 5,25,954
2018-19 : 4,43,926
2019-20 : 4,50,770
2020-21 : 4,23,427
2021-22 : 5,03,296
2022-23 : 5,62,666
2023-24 (జూన్ వరకు) : 1,31,043
మొత్తం : 44,57,068
గర్భిణులు, బాలింతలకు వరం.. అమ్మ ఒడి
గతంలో గర్భిణులు, బాలింతలు ఏఎన్సీ, పీఎన్సీ చెకప్ కోసం సమీపంలోని దవాఖానకు వెళ్లాలంటే బస్సుకో, ఆటోకో, సొంత వాహనాల్లోనో వెళ్లాల్సి వచ్చేది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే బస్టాప్ నుంచి దవాఖాన వరకు నడవాల్సి వచ్చేది. బైక్లపై వెళ్తే తీవ్ర ఇబ్బంది పడేవారు. పైగా ప్రయాణ ఖర్చు అదనం. దీంతో కొందరు ఒకటిరెండు చెకప్లకు దూరంగా ఉండేవారు. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేది. ఈ దుస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్.. ఒక కుటుంబ పెద్దగా ఆలోచించారు. శాశ్వత పరిష్కారంగా ‘అమ్మ ఒడి’ వాహన సేవలను ప్రారంభించారు. 102 పేరుతో 2017-18లో మొదలైన ఈ సర్వీసులు గర్భిణులు, బాలింతలకు వరంగా మారాయి. మొదట 200 వాహనాలతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 300 వాహనాలు ఉన్నాయి. రోజుకు సగటున 3,792 మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 58,53,618 మందిని అమ్మ ఒడి వాహనాలు గమ్యానికి చేర్చాయి. కొత్తగా కొనుగోలు చేసిన 228 అమ్మ ఒడి వాహనాలను పాత వాహనాల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
సంవత్సరం : లబ్ధిదారులు
2017-18 : 42,896
2018-19 : 6,00,421
2019-20 : 11,40,099
2020-21 : 10,84,904
2021-22 : 11,98,604
2022-23 : 14,41,629
2023-24 (జూన్ వరకు) : 3,45,065
మొత్తం : 58,53,618
బాధలో ఉన్న కుటుంబానికి ఆసరాగా..
ఒక వ్యక్తి మరణం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగుల్చుతుంది. దవాఖానలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణిస్తే.. పార్థివదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు ఈ ఖర్చు భారంగా మారుతున్నది. అప్పోసొప్పో చేసి మృతదేహాలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ వేదనను సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అర్థం చేసుకున్నారు. ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో మరణించినవారి పార్థివదేహాలను ఉచితంగా సొంతూళ్లకు తరలించేందుకు పార్థివ వాహనాలు (హర్సె వెహికిల్స్)ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలు ఉన్నాయి. రోజుకు సగటున 35 కేసుల్లో పార్థివదేహాలను తరలిస్తున్నారు. ఇప్పటిరవకు 74,317 కేసుల్లో హర్సె వాహనాలు సేవలు అందించాయి. కాలం చెల్లిన 34 వాహనాల స్థానంలోకొత్తవాటిని అందుబాటులోకి తేనున్నారు.
సంవత్సరం : తరలించిన కేసులు
2016-17 : 5104
2017-18 : 13,790
2018-19 : 11,008
2019-20 : 9,315
2020-21 : 8,540
2021-22 : 10,464
2022-23 : 12,858
2023-24 (జూన్ వరకు) : 3,238
మొత్తం : 74,317