హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): పదవీ విరమణ చేసినా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారి లెక్కలు తేలినట్టు సమాచారం. అన్నిశాఖల్లో కలిపి 1049 మంది ఉన్నారని సీఎస్ శాంతికుమారికి అధికారులు గురువారం నివేదిక అందించినట్టు తెలిసింది. అన్ని శాఖల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఈ నెల 16న సీఎస్ అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. విభాగం, హోదా, రిటైర్ అయిన సంవత్సరం, ఇప్పుడు ఇస్తున్న వేతనం వంటి పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్ పేర్కొన్నారు.
ఈ మేరకు అన్నిశాఖల నుంచి సమాచారం రాగా, జీఏడీ అధికారులు క్రోడీకరించి నివేదిక సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 179 మంది కొనసాగుతున్నారని, ఉన్నత విద్యాశాఖలో 88 మంది, ఆర్అండ్బీలో 81 మంది, పౌరసరఫరాల శాఖలో 75 మంది, నీటిపారుదల శాఖలో 70 మంది ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారని సమాచారం. ఇందులో రిటైర్డ్ ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, కన్ఫర్డ్ ఐఏఎస్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లు, ఇతర హోదాల్లో పనిచేసిన వారు ఉన్నారని అధికారులు తేల్చారు. వీరికి జీతభత్యాలకు నెలకు రూ.150 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఏటా సుమారు రూ.1,800 కోట్లు అవసరమని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నివేదికను సీఎం రేవంత్రెడ్డికి అందజేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.