సమైక్య పాలకుల వివక్షతో సాగు, తాగునీటికి అల్లాడిన పాలమూరు గడ్డపై నేడు సీఎం కేసీఆర్ జల సంకల్పంతో నీటిసవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారు చేపట్టిన సమ్మిళిత చర్యల ఫలితంగా పాలమూరులో కరువు ఛాయలు కనుమరుగవుతున్నాయి. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం.. చెక్డ్యామ్ల నిర్మాణంతో కరువు సీమ తాగునీటి దూప తీరింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమూ పూర్తయితే పాలమూరు తాగునీటి గోసకు శాశ్వతవిముక్తి లభించనున్నది.
PRLIS | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నీరు ప్రాథమిక అవసరం. జీవ మనుగడకు మూలం. దానిని ప్రతి ఒక్కరికీ అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ హక్కు. కానీ సమైక్య పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. కరువనేది ప్రతి రెండేండ్లకోసారి రావడం గతంలో ఇక్కడ పరిపాటి. వరుసగా ఏ పదేండ్లను పరిగణనలోకి తీసుకున్నా అందులో ఆరేండ్లు కరువు నెలకొన్నట్టు గత రికార్డులే చెప్తాయి. అంతేకాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పూర్తిగా దుర్భిక్ష ప్రాంతం. రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది ఇక్కడే. రాష్ట్ర సగటు వర్షపాతం 1,388.8 మిల్లీమీటర్లు కాగా, రాష్ట్రంలో అత్యల్ప సగటు వర్షపాతం కలిగిన ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లా (852.6 మిల్లీ మీటర్లు). ఆ తర్వాత నల్లగొండ 887.7, నాగర్కర్నూల్ 969.9, నారాయణపేట 979.3, వనపర్తి 991.4, మహబూబ్నగర్లో 1082.6 మిల్లీమీటర్ల వర్షపాతమే.
నల్లగొండ మినహా అన్నీ పాలమూరు జిల్లావే. ఇక జోగులాబంబ గద్వాల జిల్లాల్లో కేటీ దొడ్డి, గట్టు తదితర ప్రాంతాల్లో మరీ స్వల్పం. కరువు సంభవించిన సమయంలో వానకాలంలోనే 50 శాతానికి పైగా పంటలు డ్రైస్పెల్స్ వల్ల నష్టపోవాల్సిన దుస్థితి. పక్కనే కృష్ణమ్మ. అయినా పాలకులు ప్రాజెక్టులు కట్టింది లేదు.. చేపట్టిన ఎత్తిపోతలను పూర్తి చేసింది లేదు. కురిసిన వర్షాన్ని ఒడిసిపట్టే వ్యవస్థలనైనా బలోపేతం చేశారా? అంటే అదీ లేదు. వెరసి భూగర్భజలాలపైనే జీవనాధారం మారిన దుస్థితి. అవికూడా హద్దు మీరడంతో వందల మీటర్లు బోర్లు వేసినా నీళ్లు పడని ప్రాంతాలు అనేకం. యావత్తు జిల్లా ఏనాడూ డార్క్ జోన్ దాటి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో కరువు వ్యతిరేక పోరాటాలు నిత్యం కృత్యమైన నేలగా పాలమూరు పేరుగాంచింది. సాగునీటి సంగతేమోకానీ తాగు నీటికే తండ్లాడాల్సిన దుస్థితి. జిల్లా జనాభాలో మూడోవంతు వలస బాట పట్టిందంటే ప్రధాన కారణం నీటి కొరతే. అయినప్పటికీ ఏనాడు పాలమూరులో కరువు శాశ్వత నివారణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చర్యలు తీసుకోలేదనేది చేదు వాస్తవం.
తెలంగాణ సర్కారు బహుముఖ వ్యూహాలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరుకు మంచిరోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ దార్శనికత.. అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలతో కరువు నేలపై జలసవ్వళ్లు వినిపిస్తున్నాయి. భూగర్భజలాల స్థాయిని మెరుగుపరిచేందుకు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తొలుత మిషన్ కాకతీయ పథకం కింద 2,645 చెరువులను పునరుద్ధరించింది. పూడికలను తీయించింది. తూములు, కాలువలకు మరమ్మతులు చేయించింది. అదే సమయంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసింది. చెక్డ్యామ్ల నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది. కురిసిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టేందుకు కావాల్సిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసింది. మరోవైపు చెరువులను, పలు చెక్డ్యామ్లను ప్రధాన ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానించింది. మూడేండ్లుగా ప్రాజెక్టుల ద్వారా క్రమం తప్పకుండా చెరువులు, చెక్డ్యామ్లను నింపుతున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు చేపట్టిన ఈ సమగ్ర చర్యల మూలంగా నీటి సంరక్షణ చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నది. భూగర్భజలాల స్థాయిని, బోర్వెల్స్ స్థిరత్వాన్ని పెంచేందుకు దోహదపడుతున్నాయి.
భూగర్భజలం పైపైకి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా నాడు నీటి వసతులేవీ కల్పించకపోవడంతో మెజారిటీ ప్రాంతాల్లో భూగర్భజలాలే ఎకువగా దోపిడీకి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటికి 2014 జూన్లో జిల్లాలోని 2,656 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 83.3% (2,211 చదరపు కిలో మీటర్ల) భూగర్భ జలాల లభ్యత 10 మీటర్ల కంటే ఎక్కువ దిగువన ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందులో 8.3% ప్రాంతాల్లోనైతే 20 మీటర్లకు మించి లోతులో భూగర్భజలాలు ఉండగా, పూర్తిగా రెడ్ జోన్, మరో 16.8 శాతం ప్రాంతంలో 15 నుంచి 20 మీటర్లల లోతులో భూగర్భజలాలతో ఆరెంజ్ జోన్లో ఉన్న దుస్థితి. కానీ ప్రస్తుతం మిషన్ కాకతీయ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో అనుసంధానం ఫలితంగా నీటి సంరక్షణ పెరగడంతోపాటు భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో డార్ జోన్ లేదా ఆరెంజ్ జోన్ కింద ఎలాంటి ప్రాంతం లేకుండా పోయిందంటే ఏస్థాయిలో భూగర్భజలాలు వృద్ధి చెందాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం భూగర్భ జలమట్టం 7.56 మీటర్లుగా నమోదవడం విశేషం. మరోవైపు మిషన్భగీరథ ద్వారా సమృద్ధిగా తాగునీరు కూడా అందుతుండటంతో ఇప్పుడు జిల్లాలో నీటి కరువన్నది గణనీయంగా తగ్గుముఖం పట్టింది. చెక్డ్యామ్లు, కాలువల ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తుండటం మూలంగానూ భూగర్భ జలాల వృద్ధి గణనీయంగా పెరుగుతున్నది. ఏడాది పొడవునా తాగునీటికి రందిలేకుండా పోయింది. నీటి వనరులు వృద్ధి చెందడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. కూలీ పనులకు ఢోకా లేకుండా పోయింది. దీంతో వలసలు లేకుండా పోయాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సైతం పూర్తయితే ఉమ్మడి జిల్లాకు తాగునీటికి శాశ్వత భరోసా లభించనున్నది.
నాడు తాగునీటికీ విలవిల్లాడిన పాలమూరు
ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి మహబూబ్నగర్ యావత్తు నిత్యం తాగునీటికి కటకటలాడిపోయింది. సగటు కూలీ కూడా నీటి క్యాన్లమీద ఆధారపడక తప్పని దుస్థితి. నెలకు వందల రూపాయలు తాగునీటికే వెచ్చించాల్సిన దుస్థితి. కనీసం టీ తాగితే తప్ప హోటళ్లో కూడా నీళ్లియ్యని దయనీయ పరిస్థితి. నీళ్లను పరిమితంగా తీసుకోవడం మూలంగా అనారోగ్యాల పాలవడం ఇదో కన్నీటి విషాద గాథ. మనుషులకే నీటి గోస తప్పలేదంటే ఇక జీవాల పరిస్థితి. ఈ నేపథ్యంలో జీవాలను తోలుకుని నీటితావులున్న చోటుకు వందలాది మంది ఏటా వలసపోవడం ఇక్కడ జీవనవిధానంగా మారిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇండ్లు..వాకిళ్లు విడిచి.. పిల్లాపాపలకు దూరంగా.. పండుగ, పబ్బం లేకుండా పాలమూరు బిడ్డలు దుర్భర జీవితం గడిపారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో..
తాగునీటికి కేటాయించిన జలాలు : 7.15 టీఎంసీలు
లబ్ధి చేకూరే నియోజకవర్గాలు : 16
(నాగర్కర్నూల్, మహబూబ్నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, చేవేళ్ల, తాండూరు, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు)
మండలాలు : 70
గ్రామాలు : 1,226
నింపనున్న చెరువులు : 1,546