బాలపాదం నుంచి ఆలయ శిఖరం వరకు కృష్ణశిలలు.. సాలాహారాల్లో భారతం, భాగవతం, కృష్ణలీలలు, రామలీలలు, శ్రీనివాస లీలలు, నారసింహలీలలు.. చరిత్రకు, వేదాలకు ప్రతీకగా ప్రతిమ స్థాపన వంటివాటితో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం నభూతో న భవిష్యత్ అన్నట్టు ఉన్నదని యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకుడు నల్లంథిగల్ లక్ష్మీనారసింహాచార్యులు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ విశేషాలు ఆయన మాటల్లోనే..
చరిత్రకు దర్పణంగా..
సర్వకళ సమాహారంగా యాదాద్రి పునర్నిర్మాణం జరిగింది. పాంచరాత్రాగమశాస్త్ర ప్రకారంగా ఆలయ నిర్మాణం, విమాన గోపురం.. కాకతీయులు, ఇక్షాకులు, పల్లవులు, కుండినులు, విష్ణుకుండినుల శైలిలో, నాటి చర్రితకు దర్పణంగా, వెయ్యేండ్లు గుర్తిండిపోయేలా యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. వేల సంవత్సరాల నుంచి యాదాద్రి ఆలయం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. కాకతీయులు, ఇక్ష్వాకులు, పల్లవులు, కుండినులు, బాదామి చాళుక్యులు యాదగిరిగుట్ట ఆలయాన్ని పోషించారు. శ్రీకృష్ణదేవరాయులు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసినట్టు శాస్ర్తాలు చెబుతున్నాయి. మతసామరస్యానికి ప్రతీకగా నిజాం నవాబులూ యాదగిరి గుట్టను తమ ప్రభుత్వంలో కొనసాగించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా రూపొందించారు.
సంతానానికి ప్రతీక..
అడిగిన వెంటనే వరాలనిచ్చే దేవుడు.. యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి. నిత్యకల్యాణోత్సవాలు చేయటం వల్ల వివాహాలు చేసుకొనేవారికి స్వామి అనుగ్రహం సిద్ధిస్తుంది. నవగ్రహ స్థానానికి ఆధిపత్యం వహించినదే నారసింహావతారం. కుజరూపం నారసింహమని ప్రమాణం. జన్మాంతరాలు, లగ్నాంతరాలు, యోగాంతరాల్లో కుజగ్రహ దోషాలన్నీ యాదాద్రి లక్ష్మీనారసింహుడిని స్మరిస్తే పోతాయి. వంశాభివృద్ధికి, సంతానానికి స్వామి ప్రతీక.
దుష్టశక్తులు రాకుండా..
ఎలాంటి దుష్టశక్తులు ఆలయానికి రాకుండా, ఆలయ ఐశ్యర్యాలన్నీ బయటకు పోకుండా అష్టదిగ్భందన విధివిధానంతో స్వామివారిని బ్రహ్మకల్పాంతం వరకు సుస్థిరంగా భద్రపరిచే మహామంత్రశక్తి సమన్వితంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఈ సమయంలో నేను యాదాద్రి ఆలయానికి ప్రధానార్చకుడిగా ఉండ టం నా పూర్వజన్మ భాగ్య విశేషంగా భావిస్తున్నా.
అభినవ వైద్యుడు
భక్తులు ఏ కోరిక కోరి ప్రదక్షిణలు చేస్తారో అది తప్పక తీరుతుంది. స్వామి కలలో దర్శనమిచ్చి రోగ, గ్రహ, గృహ, పిశాచ బాధలను అంత్రమాలికుడై మంత్ర, యంత్ర, తంత్ర, లతలు, ఫలపుష్పాదులతో చికిత్స చేస్తారు. స్వామివారికి అభినవ వైద్యుడు అని పేరు. ఆయన నామాన్ని స్మరిస్తే మధుమేహం లాంటి వ్యాధి కూడా నయమవుతుంది. ఆరోగ్యప్రదాత, ఐశ్యర్య ప్రదాత యాదాద్రి లక్ష్మీనారసింహుడు.
అనిర్వచనీయ మహదానందం
శిల్పులు సుందరరాజన్, వేలు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇలా కొన్ని వందల మంది స్తపతులు, శిల్పాచార్యులు ముందుండి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ ఈవో గీత అహర్నిశలు శ్రమించి స్వామివారి ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దారు. వారి కృషి అభినందనీయం. 300 ఏండ్ల క్రితం వానమామలై పీఠాధీశ్వరులు యాదగిరిగుట్టకు వచ్చి శాస్ర్తాన్ని నిర్దిష్టం చేశారు. ప్రస్తుతం చినజీయర్స్వామి వాస్తు, సంప్రదాయ పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 21న స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రంలో ప్రారంభమై, నక్షత్ర సమ్రాట్ అయిన శ్రవణానక్షత్రంలో 28న మహాకుంభాభిషేకం నిర్వహించబోతుండటం మహామంత్ర సౌష్టవంగా భావిస్తున్నాం.
1979లో 8 మంది అర్చకులే..
1979లో ఆలయంలో 8 మంది అర్చకులు, వంటస్వాములు మాత్రమే ఉండేది. ప్రస్తుతం 25 మంది అర్చకులం ఉన్నాం. త్వరలో జరిగే ఆలయ ఉద్ఘాటనతో 50 మంది అర్చకులు పెరిగే అవకాశం ఉన్నది. భవిష్యత్తులో సుమారు 54 మంది అర్చకులు, స్వామివారి నిత్యనైవేద్యం, విశేష ప్రసాదాలు తయారు చేసేందుకు 25 మంది వంటస్వాములు పెరుగుతారు. సహస్ర ఘాటాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం.
100 రకాల కొత్త పూజలకు శ్రీకారం
స్వామివారికి ప్రస్తుతం 365 రోజుల్లో 125 రకాల అధిక పూజలను నిర్వహిస్తున్నాం. మరో 100 రకాల పూజలను నిర్వహిస్తాం. ఉత్తమాభిషేకాలు, మద్యమాభిషేకాలు, ప్రథమాభిషేకాలు, ఉత్తమోత్తమ అభిషేకాలు, ఉత్తమ మద్యమాభిషేకాలు, నక్షత్రపూజలు, సహస్రఘాటాభిషేకాలు, వైకుంఠపూజలు, అధ్యయనోత్సవాలు, ప్రభందోత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, యంత్రోత్సవాలు, పల్లవోత్సవాలు, ధూపోత్సవాలు, దీపోత్సవాలు, దవణోత్సవాలు, డోలికోత్సవాలు, మాలికోత్సవాలు, వసంతోత్సవాలు వంటి పూజలకు శ్రీకారం చుడుతాం.
యాదాద్రీశుడు భోజన ప్రియుడు
యాదాద్రి నారసింహుడు భోజన ప్రియుడు. ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం పులిహోర, చక్కెర పొంగలి, వడ, సుండెలు, దోశలు సేవిస్తారు. వారి అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్రసాదాల తయారీ అత్యంత కౌశలంగా నిర్వహిస్తాం. స్వామివారి అభిషేకం మహాప్రయోగం. ఆ మహాప్రయోగంలో సున్నాలపన్నం అనేది సంపూటికరణంగా పారాయణం చేస్తాం. మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, హోమాలు వంటివి యాదాద్రికే ప్రత్యేకత.సీఎం కేసీఆర్ 65 ఏండ్లకు వయోపరిమితి పెంచుతూ జీవోను విడుదల చేశారు. పూజారులు, వంటస్వాములు, నాదస్వర పండితులకు వర్తింపజేశారు. బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పూజారి ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పీఆర్సీలను వర్తింపజేశారు. హిందూ ఆలయాలే కాదు, ప్రతి మతాన్ని, కులాన్ని గౌరవించారు.
నూతన ఆలయానికి ఉత్తర ద్వారం
వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తారు. కానీ యాదాద్రిలో ఇప్పటిదాకా ఆ సౌకర్యం లేదు. పునర్నిర్మాణంలో భాగంగా ఉత్తర ద్వారాన్ని అద్భుతంగా నిర్మించారు. 6 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించే భాగ్యం కలిగింది.
కేసీఆర్ తపస్సు గొప్పది
నాడు నారసింహుడి ఆలయం చిన్న గుహలా ఉండేది. అప్పటి ఈవో రాజుకరణ్ ముఖమండపాన్ని విస్తృతం చేసి పశ్చిమ రాజగోపురాన్ని నిర్మించారు. అప్పటి సీఎం అంజయ్య రాజగోపురాన్ని ప్రారంభించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించి, అపర శ్రీకృష్ణదేవరాయులుగా యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా కేసీఆర్ తల్లిదండ్రులు గొప్పవారు. వారి ఔదార్యం, తపస్సు గొప్పవి. కేసీఆర్ వెయ్యి రకాలుగా ఆలోచించి కళాత్మకంగా ఆలయాన్ని నిర్మాణం చేశారు. వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అయినటువంటి వేదవైద్యుడైన స్వామివారికి వెయ్యి విధాలుగా, సప్త గోపురాలతో, రాయగిరి నుంచి యాదాద్రి వరకు రాజవీధులు, ఉద్యానవనాలు, పుష్కరిణి, చక్కటి వసతిప్రాసాదం, వర్తులాకార మహారాజ వీధులు, అభయారణ్యాలు నిర్మించారు. భక్తులకు ఏది సౌకర్యమో ఆ సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేశారు.
నిజంగా కేసీఆర్ తల్లిదండ్రులు గొప్పవారు. వారి ఔదార్యం, తపస్సు గొప్పవి. కేసీఆర్ వెయ్యి రకాలుగా ఆలోచన చేసి కళాత్మకంగా ఆలయాన్ని నిర్మాణం చేశారు. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారు. భక్తులకు ఏది సౌకర్యమో వాటన్నింటినీ ఏర్పాటు చేశారు. అపర శ్రీకృష్ణదేవరాయలుగా యాదాద్రిని తీర్చిదిద్దారు.