దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ
కేంద్ర పంచాయతీరాజ్శాఖ అభినందన
అధ్యయనం చేయనున్న జమ్ము అధికారులు
ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో 19 శాతమే!
ఉత్తరప్రదేశ్లో మరీ ఘోరంగా 5 శాతం
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇప్పటివరకు ఓడీఎఫ్ సాధించని మూడు గ్రామాలు కూడా జూన్లో ఈ లక్ష్యాన్ని సాధించాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు బహిరంగ మల, మూత్ర రహిత (ఓడీఎఫ్) ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ఈ ఘనత సాధించినందుకు ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సునీల్కుమార్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి వినీ మహాజన్ తదితరులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రశంసించారు. ప్రతి గ్రామాన్ని ఓడీఎఫ్ ప్లస్గా మార్చడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ మాదిరిగా మిగిలిన రాష్ర్టాలు కూడా అన్ని గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్గా మార్చడానికి కృషి చేయాలని సూచించారు. ఓడీఎఫ్ ప్లస్లోనూ దక్షిణాది రాష్ట్రాలు పురోగతిసాధిస్తుండగా ఉత్తరాది రాష్ట్రాలు పోటీపడలేకపోతున్నాయి. తమిళనాడులో 92% గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ సాధించాయి. ఆ తరువాత పుదుచ్చేరి 61% సాధించింది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 19% గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొందాయి. ఉత్తరప్రదేశ్లో 5% గ్రామాలే ఈ లక్ష్యాన్ని సాధించాయి.
పల్లె ప్రగతితోనే..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ప్రతి గ్రామాన్ని ఓడీఎఫ్ ప్లస్గా మార్చడంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు చెప్తున్నారు. పల్లెప్రగతిలో నిర్మించిన మరుగుదొడ్లను వాడుకొనేవిధంగా చేయడం, రోడ్ల మీదికి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టడం, పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపర్చడం, ఇంకుడు గుంతలు నిర్మించడం, ట్రాక్టరు, డంపింగ్ షెడ్లు, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలతో ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా మారింది. తెలంగాణ పల్లెలకు అనేక రకాలుగా గుర్తింపు, అవార్డులు లభించాయి.
రాష్ట్ర పర్యటనకు రానున్న జమ్ము అధికారులు
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొందడంతో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము అధికారులు తెలంగాణలో పర్యటించి, ఇక్కడి విజయాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేంద్రం రాష్ర్టానికి సమాచారం ఇచ్చింది. జమ్ములో మే చివరి వరకు ఒక్క గ్రామం కూడా ఓడీఎఫ్ ప్లస్ సాధించలేదు.