హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్యచేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా ముక్తా క్యాసారం, మునిపల్లి మండలానికి చెందిన రేణుక, కృష్ణ దంపతులకు కూతురు (10), కొడుకు (8) ఉన్నారు. ఉపాధి కోసం వారి కుటుంబం మూడేండ్ల కింద నగరానికి వచ్చి కూకట్పల్లిలోని సంగీత్నగర్లోని ఓ అపార్ట్మెంట్ పెంట్హౌస్లో నివాసం ఉంటున్నది. రేణుక స్థానిక ప్రైవేట్ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్గా, కృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తున్నారు.
కూతురు బోయినపల్లి కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి, కొడుకు స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వర్షం కారణంగా సోమవారం కేంద్రీయ విద్యాలయానికి సెలవు కావడంతో బాలిక ఇంటి వద్దనే ఉన్నది. కొడుకును ఉదయం 9 గంటలకు స్కూల్కు పంపిన దంపతులు తమ విధులకు వెళ్లారు. టిఫిన్ బాక్స్ తేలేదని కొడుకు స్కూల్ నుంచి కృష్ణకు ఫోన్ వచ్చింది. దీంతో బాలిక తండ్రి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడికి లాంచ్ బాక్స్ తీసుకేళ్లేందుకు ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచేసరికి బెడ్రూమ్లో బాలిక రక్తపు మడుగులో పడి ఉన్నది. కడుపు, ఛాతిపై కత్తిపోట్లతో విగతజీవిగా ఉండటాన్ని చూసి తండ్రి గుండెలు బాదుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
బాలిక హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికపై దుండగులు లైంగికదాడికి యత్నించారా? లేక దొంగతనానికి వచ్చి, హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తెలిసిన వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక రక్త సంబంధీకుల హస్తం ఉన్నదా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగులను గుర్తించడం సవాల్గా మారింది.