సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం మాడల్ స్కూళ్లను రద్దు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం వాటి బాధ్యత తీసుకున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి ఇన్స్పైర్, 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆయన తిలకించారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 10 శాతం నిధులను విద్యాభివృద్ధికి వినియోగిస్తున్నట్టు తెలిపారు. ‘మనఊరు-మన బడి’ పథకం ద్వారా రూ.7 వేల కోట్లతో బడుల ఆధునీకరణ పనులు చేపట్టినట్టు చెప్పారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థినులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి హెల్త్ హైజీనిక్ కిట్స్-శానిటరీ కిట్స్ పంపిణీ కార్యక్రమం మరో 20 రోజుల్లో ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. యువత, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం స్కిల్ సెంటర్ల ద్వారా కృషిచేస్తున్నట్టు చెప్పారు. వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయని తెలి పారు. నిరుద్యోగులు శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన కోరారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని హరీశ్రావు తెలిపారు.