5 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన పూడూర్
మేడ్చల్, ఫిబ్రవరి 10: ఫాంహౌస్ నిర్మాణ అనుమతి కోసం ఓ సర్పంచ్ రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు తీసుకొంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. మేడ్చల్ మండలం పూడూర్లోని సర్వే నంబర్ 312లో సంగి శ్రీనివాస్రావు అనే వ్యక్తి 3.35 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఫాంహౌస్ నిర్మించుకొనేందుకు అనుమతి కోసం గత అక్టోబర్లో పంచాయతీలో దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును జీపీ సిబ్బంది తిరస్కరించటంతో శ్రీనివాస్రావు, సర్పంచ్ బాబుయాదవ్ను కలిశారు. రూ.10 లక్షలు లంచమిస్తేనే అనుమతి ఇస్తానని సర్పంచ్ స్పష్టం చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. అధికారుల సూచన మేరకు సర్పంచ్ను మరోసారి కలిసి రూ.9 లక్షలకు ఒప్పందం చేసుకొన్నారు. గురువారం శామీర్పేటలోని ఊర్జిత వెంచర్లో సర్పంచ్ రూ.5 లక్షలు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. శుక్రవారం సర్పంచ్ను ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ వెల్లడించారు.