నిజామాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 1,83,883 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1082.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.