హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఏడాది 3 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జిల్లాలవారీగా సాగు విస్తీర్ణం, పెట్టుబడి ఖర్చులపై నివేదిక రూపొందించింది. వచ్చే నాలుగేండ్లలో మొత్తం 3 లక్షల ఎకరాల్లో సాగుకు రూ.3600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఎకరా ఆయిల్పామ్కు సాగుకు నాలుగేండ్లలో రూ.1.20 లక్షల పెట్టుబడి అవుతుందని ఇటీవలే నాబార్డు లెక్క తేల్చింది. దీనిప్రకారం 3 లక్షల ఎకరాల్లో సాగుకు రూ.3,600 కోట్లు ఖర్చు అవుతుందని ఉద్యానశాఖ అంచనా వేస్తున్నది. వాస్తవంగా కొద్దికాలంలోనే రాష్ట్రంలో ఆయిల్సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే 26 జిల్లాలకు 11 కంపెనీలను కూడా ఎంపికచేసింది. సాగు విస్తీర్ణం పెంపులో భాగంగా వచ్చే ఏడాది 3 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 27 వేలు, మహబూబాబాద్ జిల్లాలో 23,500, సూర్యాపేటలో 21,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రణాళిక తయారు చేసింది. ఆయిల్పామ్కు అవసరమైన రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు సూచించిన ప్రభుత్వం.. మూడేండ్లలో రూ.36వేలు సబ్సిడీ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.