ఆదిలాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డల సంరక్షణకు పలు పథకాలను అమలు చేస్తున్నది. నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ‘నియోనేటల్ కేర్’ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనం నవజాత శిశువుల పరిరక్షణలో ఆపద్బాంధవిగా నిలుస్తున్నది. అత్యవసర వేళ అపర సంజీవినిలా ప్రత్యక్షమవుతున్నది. అనారోగ్యంతో ఉన్న పసికందును ఆగమేఘాల మీద దవాఖానకు తరిలిస్తూనే అధునాతన వైద్యం అందిస్తున్నది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యశాలలో ఈ సేవలను ప్రారంభించింది. వీటిలో ఆక్సిజన్ సౌకర్యంతో పాటు శిశువులకు శ్వాస అందించడానికి వెంటిలేటర్, హైపోథెర్మియాకు గురైతే రేడియంట్ వార్మర్, పల్స్, రక్తంలో ఆక్సిజన్, హార్ట్బీట్ పరీక్షించడానికి మల్టీ చానల్ మానిటర్, పల్స్ ఆగిపోతే షాక్ ఇచ్చి పునరుద్ధరించడానికి నియోనేటల్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో శిశువులను తరలించేటప్పుడు ఎలాంటి భయం ఉండదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ అంబులెన్స్లు అందుబాటులోకి రావడంతో శిశువులకు మరింత మెరుగైన వైద్య సదుపాయం లభించినట్టు అయ్యింది.
శిశుమరణాలు తగ్గుతాయి
ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన నియోనేటల్ కేర్ అంబులెన్స్లు శిశువులకు మెరుగైన వైద్యం అందించడానికి ఎంతో ఉపయోగపడుతాయి. వీటిలో అన్ని సౌకర్యాలు ఉండటంతో తక్కువ బరువు, ఇతర ఆరోగ్య సమస్యలతో పుట్టిన శిశువులకు చికిత్స కోసం హైదరాబాద్ దవాఖానలకు సురక్షితంగా తీసుకెళ్లొచ్చు. శిక్షణ పొందిన సిబ్బంది అంబులెన్స్లో ఉంటారు. రవాణా సమయంలో శిశువులకు అవసరమైన వైద్యం అందిస్తారు. ఈ అంబులెన్స్ వల్ల శిశుమరణాలు నివారించవచ్చు.
– నరేందర్ రాథోడ్, ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి