వేల్పూర్/కమ్మర్పల్లి, నవంబర్ 8: దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ ర్యాడ మహేశ్ త్యాగం వెలకట్ట లేనిదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లిలో ర్యాడ మహేశ్ విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు దాదాపు రెండు వేలమంది యువకులతో కలిసి మంత్రి వేముల బైక్లపై కోమన్పల్లికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. దేశం కోసం వీరుడిని అందించిన మహేశ్ తల్లిదండ్రులు, కోమన్పల్లి గ్రామస్థులు ధన్య జీవులన్నారు.
ఉద్యోగ నియామక పత్రం, చెక్కు అందజేత
మహేశ్ కుటుంబ పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే అండగా నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి వేముల తెలిపారు. ఇందులో భాగంగానే మహేశ్ సతీమణి సుహాసినికి రిజిస్ట్రేషన్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి ప్రభుత్వం తరఫున అందజేశారు. అంతేగాక సదరు కుటుంబానికి ప్రభుత్వ సాయంగా రూ.50 లక్షల చెక్కు, ఆర్మూర్లో కేటాయించిన 300 గజాల ఇంటి స్థలం పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.