మునుగోడు, అక్టోబర్ 10: మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు మండలం పలివెల, కోతులారం గ్రామాల్లో సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మునుగోడును అధోగతి పాలు చేశారని విమర్శించారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హయాంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించేందుకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్తో జట్టుకడుతున్నారని తెలిపారు. ఓట్లు అడిగే హక్కు బీజేపీకి, కాంగ్రెస్కు లేదన్నారు.
కారు గుర్తుకే ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం పలివెల గ్రామానికి చెందిన ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమావేశంలో ములు గు జడ్పీ చైర్మన్ కూస జగదీశ్,టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పూల వెంకటేశ్, ఎంపీటీసీ చెరుకు కృష్ణయ్య, నాయకులు దాడి శ్రీనివాస్రెడ్డి, జగన్, ఆనగంటి కృష్ణ, నాతి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.