హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంతోపాటు రాష్ర్టానికి ప్రమాదకరంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటమే తమ లక్ష్యమని, ఈ మేరకు మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర తృతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 22 సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో సభ, 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో 400 మందితో ప్రతినిధుల సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో నిధుల దుర్వినియోగం జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శాస్త్రీయంగా ఇంగ్లిష్ మీడియాన్ని అమలు చేస్తూనే.. తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీపీఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, బృందాకారత్ తదితరులు మహాసభల్లో పాల్గొంటారని చెప్పారు.