హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య కొనసాగుతున్న బకాయిల వివాదాన్ని మధ్యవర్తిత్వం (మీడియేషన్) ద్వారా పరిషరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు రూ.4.08 కోట్లు రావాల్సి ఉన్నదని, ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ టీ వినోద్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిషరించుకోవాలని ధర్మాసనం సూచించడంతో.. అందుకు సిద్ధమేనని ఇరు పక్షాల న్యాయవాదులు తెలిపారు. దీంతో ఇరుపక్షాల న్యాయవాదులు ఈ నెల 12న హైకోర్టులోని మీడియేషన్ కేంద్రంలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఎదుట హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. మధ్యవర్తిత్వ కేంద్ర నివేదిక జారీ చేశాక దానిని తమకు నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.