హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పేస్కేల్ ఆధారంగానే హెచ్ఆర్ఏ ఖరారు చేసినట్టు టీఎస్ఆర్టీసీ స్పష్టంచేసింది. తాజాగా 2017 పే స్కేల్ రివిజన్ చేసి ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్ ప్రకటించినట్టు వెల్లడించింది. జీవో నంబర్ 53 ప్రకారం 2020లో ఆర్టీసీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ సవరణ చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోలేదని పేర్కొన్నది.
దీంతో హెచ్ఆర్ఏ తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. తాజాగా పే స్కేల్ సవరణ చేయడంతో హెచ్ఆర్ ఏ 17% నిర్ణయించడమైందని స్పష్టం చేసింది. కానీ, సోషల్ మీడియాలో, పత్రికల్లో ఆర్టీసీ హెచ్ఆర్ఏ కు కోత పెట్టిందనే విధంగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది. ఆర్టీసీ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో ఎలాంటి కోత విధించలేదని తెలిపింది.