కోరుట్ల, మే 12: చదువుకోవాలన్న ఆ నవవధువు తపనకు భర్త సహకారం తోడైంది. పెండ్లయిన రెండు గంటలకే భర్తతో కలిసి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్టకాలనీకి చెందిన లాస్య అలియాస్ పద్మావతి స్థానిక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండియర్ చదువుతున్నది. ఈ క్రమంలోనే లాస్యకు శంషాబాద్ సమీపంలోని నాగులపల్లికి చెందిన రాజుతో శుక్రవారం ఉదయం 10 గంటలకు వివాహం జరిగింది. ఇదే రోజు మధ్యాహ్నం కెమిస్ట్రీ పరీక్ష ఉండగా.. పెండ్లయిన తర్వాత ఆ యువతి తన భర్తతో కలిసి పెండ్లి దుస్తుల్లోనే పరీక్షా కేంద్రానికి వచ్చింది. నిర్వాహకులు ప్రత్యేక గది కేటాయించగా పరీక్ష రాసింది.