కోల్కతా, అక్టోబర్ 22: నేతాజీ సుభాష్ చంద్రబోస్విగా భావిస్తున్న అస్థికలను జపాన్ నుంచి భారతదేశానికి తెప్పించేందుకు పీవీ నరసింహరావు హయాంలో ప్రయత్నాలు జరిగాయని నేతాజీ మనుమడు ఆశిష్ రాయ్ చెప్పారు. ఇందుకోసం అప్పటి కేంద్రప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని తెలిపారు. అందులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా సభ్యుడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, అస్థికలను భారతదేశానికి తెప్పిస్తే అల్లర్లు చెలరేగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయని, అందుకే ఆ ప్రయత్నాన్ని మానుకొన్నారని తెలిపారు. నేతాజీ చనిపోలేదని ప్రజలు భావించడమే అందుకు కారణంగా నిఘా వర్గాలు పేర్కొన్నాయన్నారు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి 78 ఏండ్లు గడిచిన సందర్భంగా విదేశాంగ శాఖ, ఇండో-జపాన్ సమురాయ్ సెంటర్ సంయుక్తంగా వర్చువల్గా నిర్వహించిన కార్యక్రమంలో ఆశిష్ రాయ్ మాట్లాడారు. నేతాజీ అస్థికలపై ఆయన కూతురు అనితా బోస్కే చట్టబద్ధ హక్కులు ఉన్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అస్థికలను తెప్పించేందుకు ప్రయత్నించాలని కోరారు. నేతాజీ జీవితంపై ఆశిష్ రాయ్ విస్తృతంగా అధ్యయనం చేశారు. పుస్తకాలు రాశారు. ఇదే కార్యక్రమంలో నేతాజీ మనుమరాలు ప్రొఫెసర్ సుగతా బోస్ మాట్లాడారు. ‘సుభాష్ చంద్రబోస్ మరణంపై అర్థం పర్థం లేని వివాదాలకు ఇకనైనా ముగింపు పలకాలి’ అని అన్నారు. నేతాజీ అస్థికల అంశం కేవలం ఆయన కుటుంబానికే పరిమితం అయింది కాదని, దేశానిదని వ్యాఖ్యానించారు. 1945లో ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని కొంత మంది.. ఆయన అప్పుడు చనిపోలేదని తర్వాత చాలా కాలం జీవించారని మరి కొంత మంది భావిస్తారు. ఆయనవిగా భావిస్తున్న అస్థికలు టోక్యోలోని రెన్కోజీ ఆలయంలో 1945 సెప్టెంబర్ నుంచి భద్రపరిచారు.