హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ప్రజల మధ్య విభేదాలు సృష్టించటం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కులం, మతం పేరుతో విడగొడుతున్నారని అన్నారు. చట్టసభల్లోనే బూతులు, అసభ్య పదజాలం వాడటం దారుణమని పేర్కొన్నారు. కులం, మతం, నేరప్రవృత్తి, డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వటం వల్లే ఈ పరిస్థితి అన్నారు. సమాజం కోసం పాటుపడిన వారిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకొంటారని చెప్పారు. తాను ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా వేషధారణ మార్చలేదని సంప్రదాయ వస్త్రాలతో ఏ దేశానికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని తెలిపారు. మన సంప్రదాయాలను మనం పాటిస్తే.. ప్రపంచం మనలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు.