హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): మానవవనరుల అభివృద్ధికి మూలమైన విద్యారంగానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ అధిక ప్రాధాన్యమిచ్చింది. తిరోగమన విధానాలతో రాష్ర్టాన్ని పాలిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఇతర అన్ని రంగాలతో పాటు విద్యారంగాన్ని కూడా అధోగతిపాలు చేస్తున్నది. పురోగామి రాష్ర్టాన్ని బీమారీ రాష్ట్రంగా మార్చింది. బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన పురోగామి విధానాలను పక్కనపెట్టేసింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను మూలనపెట్టింది. కేసీఆర్ సర్కార్ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపితే.. అస్తవ్యస్త విధానాలతో ప్రగతిశీల రాష్ర్టాన్ని కాంగ్రెస్ అధ్వాన స్థితికి దిగజార్చింది. పెంచడం-పంచడం నినాదంతో కేసీఆర్ పనిచేస్తే.. తుంచడం అనే ఏకైక ఎజెండాగా ఇప్పటి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలోని 27వేల సర్కార్ బడులను 4 వేలకు కుదించాలని, 23 వేల పాఠశాలలను మూసివేసేందుకు రంగం సిద్ధంచేసేందుకు సర్కార్ సిద్ధపడటం దానినే సూచిస్తున్నది.
నీతి ఆయోగ్ ప్రశంసలు
కేసీఆర్ ప్రభుత్వం నాడు చేపట్టిన విద్యా సంస్కరణలను నీతిఆయోగ్ ప్రశంసించింది. పాఠశాల విద్యలో స్థూల నమోదు నిష్పత్తి పెరుగడం, డ్రాపౌట్ రేటు తగ్గడం వంటి చర్యలపై కితాబిచ్చింది. కరోనా విపత్కర కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన డిజిటల్ చదువులపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. రా్రష్ట్రంలో బహుముఖ వ్యూహంతో విద్యాప్రమాణాల పెంపును కొనియాడింది. దేశంలోని 14 రాష్ర్టాలు మన విద్యా విధానాన్ని అధ్యయనం చేశాయి. హార్వర్డ్ యూనివర్సిటీ గురుకులాల విజయగాథను కేస్ స్టడీగా తీసుకొని అధ్యయనం చేసింది. 2014-15, 2019-20లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాలు తెలంగాణ ముస్లిం బాలికల విద్యాభివృద్ధికి అద్దం పట్టాయి. ఈ రెండు సర్వేల ప్రకారం ముస్లిం బాలికల కళాశాల విద్యలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలువడం గర్వకారణం. పాఠశాల విద్యలోనూ జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. గడిచిన ఏడేండ్లలో కళాశాలల విద్యలో ముస్లిం బాలికల ప్రవేశాల వృద్ధిరేటు జాతీయస్థాయి సగటు 3శాతం కాగా, అందులో తెలంగాణ వృద్ధిరేటు 26శాతం నమోదైనట్టు ఆ సర్వే వెల్లడించింది. ముస్లిం బాలికల పాఠశాల విద్యలోనూ తెలంగాణ ఏకంగా 10 శాతం వృద్ధిని సాధించి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలువడం విశేషం.
పదేండ్లలో బడ్జెట్ రెండింతలు
రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో రాష్ట్ర బడ్జెట్లో పాఠశాల విద్య వాటా రూ.10వేల కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమంగా పెంచింది. పదేండ్లలో దానిని రెట్టింపు చేసింది. బడ్జెట్ విస్తృతి పెరిగిన కొద్దీ.. పాఠశాల విద్యకు బడ్జెట్ కేటాయింపులను పెంచింది. అంతేగాకుండా గురుకులాల మీద పెద్ద ఎత్తున ఖర్చుచేసింది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా ఏటా రూ.4 వేల కోట్లను గురుకులాల కోసమే వెచ్చించింది. 2014లో గురుకులాల బడ్జెట్ రూ.744 కోట్లు మాత్రమే. 2023 వచ్చేసరికి ఈ బడ్జెట్ రూ.4వేల కోట్లకు పెరిగింది. ఉపకార వేతనాల రూపంలో రూ.2,800 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చుచేసింది. ఫలితంగా 3,000 మంది ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీల్లో చేరారు. మరో 6,000 మంది ఓవర్సీస్ స్కాలర్షిప్స్ రూపంలో విదేశీ విద్యను అందిపుచ్చుకొన్నారు.
బడుల రూపురేఖలు మార్చిన ‘మన ఊరు-మన బడి’
సర్కార్ బడులు స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా.. 12అంశాలతో స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కృషి చేసింది. శిథిలావస్థలో కళావిహీనంగా మారిన ఎన్నో బడులు ఈ కార్యక్రమంతో కొత్త రూపును సంతరించుకొన్నాయి. దాదాపు 8వేల కొత్త తరగతి గదుల నిర్మాణానికి అంకురార్పణ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రతి స్కూల్కు డ్యూయల్ డెస్క్ బల్లలు అందాయి. విద్యార్థులకు సురక్షిత మంచినీటి సదుపాయం ఏర్పడింది. బడుల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటుచేసింది. డిజిటల్ విద్యలో భాగంగా సర్కార్ బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను సమకూర్చింది.
కేసీఆర్ మంచి పనులు
విద్యా విప్లవం..
సర్కార్ విద్యావ్యవస్థకు స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వం నూతన జవసత్వాలు నింపింది. సర్కార్ బడులు, ఇతర విద్యాసంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం బలోపేతం చేసింది. తొలి విడుతలో 1,000కి పైగా గురుకులాలను నెలకొల్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు, బాలురకు ప్రత్యేక గురుకులాలను ఏర్పాటుచేసింది. ఆ గురుకులాల్లోని ఒక్కో విద్యార్థి మీద రూ.1.25 లక్షలు ఖర్చుచేసింది. ఆనాడు బలోపేతమైన మన గురుకుల విద్య యావత్తు దేశానికే రోల్మాడల్ అయ్యింది. వివిధ రాష్ర్టాలకు పాఠాలు నేర్పే అధ్యయన కేంద్రమైంది. ఇలా అతి తక్కువ కాలంలోనే తెలంగాణ విద్యారంగం అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది.
బడిలో విద్యార్థులేరి?
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే లేరు. ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉండగా.. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ సందర్శించిన సమయంలో ఆయన కూడా కనిపించలేదు. ఈ విషయమై అక్కడున్న అటెండర్ను అడగ్గా.. సార్ బయటకు వెళ్లారని తెలిపారు. పక్కన కొత్తగా టెంపుల్ నిర్మాణం చేపడుతుండగా, నీటిని వాడుకునేందుకు పాఠశాలలోని బోరుకు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వైర్లను నేలమీద నిర్లక్ష్యంగా వదిలేశారు. కాసేపటికి ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చారు. హాజరు పట్టికలో నలుగురు విద్యార్థుల పేర్లు ఉంటే, ఒక్కరు కూడా పాఠశాలకు రాకపోవడమేమిటని ప్రశ్నించగా.. ‘పిల్లలు పాఠశాలకు రాలేదనే వారి తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లాను. రేపటి నుంచి విద్యార్థులు పాఠశాలకు వస్తారు’ అని ఉపాధ్యాయుడు చెప్పడం గమనార్హం.