హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొంటామని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. పల్లె, పట్టణం తేడాలేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తూ.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పష్టంచేశారు. గురువారం హైదరాబాద్ మెట్రోజోన్ కార్యాలయంలో విద్యుత్తు వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. సంస్థ పరిధిలో 91 వినియోగదారుల సేవా కేంద్రాలు పని చేస్తున్నాయని.. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నట్టు చెప్పా రు.
కొత్త సర్వీసుల మంజూరు, టైటిల్ ట్రాన్స్ఫర్, అదనపు లోడ్, సరఫరా తదితర సమస్యలపై ఫిర్యాదులను ఆన్లైన్లోనే స్వీకరించి, తక్షణమే పరిష్కరిస్తున్నట్టు వివరించారు. ఫిర్యాదుల పర్యవేక్షణకు డైరెక్టర్ రాములును ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. విద్యుత్తు పంపిణీ వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు రూ.18,624 కోట్లు వెచ్చించామన్నారు.
విద్యుత్తు వినియోగదారుల పరిషార వేదిక (సీజీఆర్ఎఫ్) 1, 2 చైర్మన్లు జయరాజ్, దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి సమస్య తలెత్తినా సీజీఆర్ఎఫ్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.కార్యక్రమంలో విద్యుత్తు అంబుడ్స్మన్ మహమ్మద్ నిజాముద్దీన్, సంస్థ డైరెక్టర్లు టీ శ్రీనివాస్, జే శ్రీనివాస్రెడ్డి, కే రాములు, ఎస్ స్వామిరెడ్డి, సీహెచ్ మదన్మోహన్రావు, జీ గోపాల్, సీజీఎంలు పాండ్య, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.