కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి చేతకాని దద్దమ్మ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అని, చర్చకు రమ్మంటే ముఖం చాటేశాడని ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి విరుచుకుపడ్డారు. ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండీ హుజూరాబాద్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాడి కౌశిక్రెడ్డి ర్యాలీగా తరలివచ్చారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అక్కడే వేచి ఉన్నా ఈటల రాలేదు. గంటపాటు వేచి ఉన్న కౌశిక్రెడ్డి చర్చావేదికపై ఈటల కోసం వేసిన కుర్చీకి పూలమాల వేసి సన్మానం చేశారు.
అనంతరం కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్పై ప్రేమ ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పాలని ఈటలను ప్రశ్నించారు. హుజూరాబాద్కు సీఎం కేసీఆర్ కేటాయించిన రూ.100 కోట్లకు సంబంధించిన వివరాలను జీవోలతో సహా వివరించారు. పట్టణంలోని తన ఇంటికి వెళ్లే రోడ్డును కూడా ఈటల బాగు చేయించుకోలేదని, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తే రూ.6 కోట్ల నిధులిచ్చి అద్దంలాంటి రోడ్డు నిర్మించారని గుర్తుచేశారు.
సొంత ఊరు కమలాపూర్లో ఒక బస్టాండ్ కట్టించలేకపోయాడని, ఇప్పుడు రూ.2 కోట్లతో సీఎం కేసీఆర్ బస్టాండ్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. మంత్రిగా ఉండీ హుజూరాబాద్ను జిల్లాగా చేసుకోలేకపోయిన అసమర్థుడు ఈటల అని ధ్వజమెత్తారు. ఢిల్లీలో బ్రోకర్ పనిచేస్తేనే చేరికల కమిటీకి ఈటల చైర్మన్ అయ్యారని ఎద్దేవాచేశారు. ‘హుజూరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చాలెంజ్ చేస్తున్నా.. హుజూరాబాద్ అభివృద్ధి కావాలని కోరుకుంటే కేంద్రం నుంచి నువ్వొక రూ.100 కోట్లు తీసుకురా, నేను రాష్ట్రం నుంచి రూ.150 కోట్లు తెస్తా. తన్నుకుడు, గుద్దుకునుడు కాదు. అభివృద్ధిలో పోటీ పడుదాం’అని సవాల్ విసిరారు.