గోదావరిఖని, జూలై 26: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వన్టౌన్ మోడల్ పోలీస్స్టేషన్, పోలీస్ గెస్ట్హౌస్లను త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా తెలిపారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. 3 లక్షలకుపైగా జనాభా ఉన్న గోదావరిఖని పట్టణంలో వన్టౌన్ పోలీస్స్టేషన్లో ప్రస్తుతం ఎలాంటి వసతులు లేవన్నారు. ఈ ప్రాంతవాసిగా సమస్యను గుర్తిం చి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. వారి సహకారంతో కోల్బెల్ట్లో రాష్ర్టానికే ఆదర్శంగా మోడల్ పోలీస్స్టేషన్, పోలీస్ గెస్ట్హౌస్ నిర్మాణానికి పూనుకున్నట్టు తెలిపారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థ నుంచి రూ.3.5 కోట్లను మంజూరు చేయించడంతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న వన్టౌన్ పోలీస్ స్టేషన్ స్థలంలోనే జీ+2 భవనాన్ని నిర్మించామని తెలిపా రు. ఈ మోడల్ పోలీస్స్టేషన్లో 50 మంది కూర్చునేలా విజిటర్స్ హాల్, పురుషులు, మహిళల కోసం టాయ్లెట్స్, ఫిర్యాదుదారుల కోసం రిసెష్షన్ కౌంటర్, వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు. పట్టణంలోని పాత డిగ్రీ కళాశాలలో ఎకరం 30 గుంటల స్థలాన్ని పోలీస్ గెస్ట్హౌస్కు సింగరేణి యాజమాన్యం కేటాయించిందని తెలిపారు. దీనికితోడు ఎన్టీపీసీ నుంచి రూ.3.4 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. అన్ని హంగులతో పోలీస్ గెస్ట్హౌస్ నిర్మాణం పూర్తయిందని, పోలీస్ అధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు, బస చేసేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు కోలేటి దామోదర్గుప్తా పేర్కొన్నారు.