హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసిన కోర్టు, పిటిషనర్కు ఉన్న అభ్యంతరాలను సుప్రీంకోర్టులోనే ప్రస్తావించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం తుది ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26న జారీచేసిన జీవో-71ను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సయ్యద్ హైదర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించిన వివాదం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నదని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా నియామకాలు చేపట్టడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఈ అంశం సుప్రీంకోర్టులోని స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) నంబర్ను ప్రస్తావించలేదని చెప్పారు. వాదనలపై జస్టిస్ నగేశ్ భీమపాక స్పందిస్తూ, జీవో-71లో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు తుది తీర్పునకు ఈ నియామకాలు లోబడి ఉంటాయని స్పష్టంగా పేరొన్నారని గుర్తుచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంపై హైకోర్టు జోక్యం చేసుకోబోదని తెలిపారు. పిటిషనర్కు ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్పై విచారణను మూసివేస్తున్నట్టు ప్రకటించారు.