హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ఎంబీబీఎస్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఇతర రాష్ర్టాల విద్యార్థులకు ఇవ్వరాదన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ అభినంద్కుమార్ షావిలీ, జస్టిస్ ఎన్ రాజేశ్వర్రావు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమైనదని, దీనివల్ల ఏపీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇటీవల జారీచేసిన 72 జీవోను రద్దు చేయాలని కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ వాదన వినిపించేందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది.