హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ ధర రూ.కోటిగానూ, శుక్రవారం రూ.1.5 కోట్లుగానూ ఖరారు చేశారు. టీటీడీ దగ్గర 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్తో దాదాపు 25 ఏండ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందవచ్చు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపు రూ.600 కోట్ల ఆదాయం సమకూరనున్నది. ఈ టికెట్ల ద్వారా వచ్చే నిధులతో చిన్నపిల్లల ధవాఖాన నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.