హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ):
కన్సల్టెన్సీ – హలో సర్
లెక్చరర్ – హలో చెప్పండి!
కన్సల్టెన్సీ – సర్.. ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ కావాలి
లెక్చరర్ – నేను వేరే చోట పనిచేస్తున్నా!
కన్సల్టెన్సీ – థంబ్ వేస్తే సరిపోతుంది. ఉదయం, సాయంత్రం వచ్చి వేసిపోవాలి.
లెక్చరర్ – ఎంతిస్తారు?
కన్సల్టెన్సీ – బాచుపల్లిలోని కాలేజీలో రూ.15 వేలు, కూకట్పల్లి కాలేజీలో రూ.10 వేలు ఇస్తారు.
లెక్చరర్ – నేను దిల్సుఖ్నగర్లో ఉంటాను. నాకు ఉదయం అయితే ఓకే. సాయంత్రం రావడం కుదరదు.
కన్సల్టెన్సీ – సర్ దిల్సుఖ్నగర్లో అయితే ఇన్స్పెక్షన్ టైంలో ర్యాటిఫికేషన్ కోసం అయితే ఓకే
లెక్చరర్ – ఎంతిస్తారు?
కన్సల్టెన్సీ – మొత్తం రూ.20 వేలు ఇస్తారు. మొదటి ఇన్స్పెక్షన్ సమయంలో రూ.5 వేలు ఇస్తారు. ర్యాటిఫికేషన్ కోసం జేఎన్టీయూ వాళ్ల ముందు హాజరుకావాలి. రెండో ఇన్స్పెక్షన్ సమయంలో రూ.15 వేలు ఇస్తారు.
లెక్చరర్ – నేను ఇప్పటికే ఒక కాలేజీలో థంబ్ వేస్తున్నా, సర్టిఫికెట్లు వాళ్లే తీసుకొంటారా?
కన్సల్టెన్సీ – అయినా ఫర్వాలేదు. మీకు ఐడీ ఇస్తారు. సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేస్తారు.
లెక్చరర్ – ఓ మూడు రోజులు ఆగండి. ఆలోచించుకొని చెప్తా.
ఇదీ ఓ కన్సల్టెన్సీ, అధ్యాపకుడి మధ్య జరిగిన సంభాషణ. ఫేక్ ఫ్యాకల్టీ కోసం ఇంజినీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయనటానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఓ కాలేజీలో 120 మంది లెక్చరర్లుగా ఉన్నట్టు చూపిస్తారు. కాని వాళ్లు కాలేజీకి రారు. పాఠాలు చెప్పరు. వారి స్థానంలో అర్హత లేని వారు లెక్చరర్లుగా పనిచేస్తారు. జేఎన్టీయూ రికార్డుల్లో ఉండేది ఒకరైతే కాలేజీల్లో పనిచేసేది మరొకరు. ఇలా కొన్ని కాలేజీలు ఉత్తుత్తి లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నాయి. ఏఐసీటీఈ, జేఎన్టీయూ నిబంధనలను ఉల్లంఘించి ఇలా ఫేక్ లెక్చరర్లతో మమ అనిపించేస్తున్నాయి. వాస్తవానికి ఒక ఇంజినీరింగ్ కాలేజీలో ఒక డిపార్ట్మెంట్కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసొసియేట్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. తగిన స్థాయిలో ల్యాబ్లు, సాంకేతిక నిపుణులు ఉండాలి. పనిచేస్తున్న అధ్యాపకుల బయోమెట్రిక్ హాజరును ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నమోదు చేయాలి. ఈ నిబంధనలను పాటించలేక కన్సల్టెన్సీల సహాయంతో చాలా కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి.
ర్యాటిఫికేషన్ అయితేనే!
2022-23 విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు కోసం పలు కాలేజీలు ఏఐసీటీఈకి దరఖాస్తులు సమర్పించాయి. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తుకు గాను అధికారులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెలాఖరులో లేదా.. ఆగస్టు మొదటి వారంలో తనిఖీలు ప్రారంభం అవుతాయి. కాలేజీలు ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు ఎంపికచేసే అధ్యాపకులను అఫిలియేషన్ ఇచ్చే సమయంలో యూనివర్సిటీ అధికారులు పరిశీలించి, ఆమోదించాలి. ఇలా ఆమోదించడాన్ని ర్యాటిఫికేషన్ అంటారు. అధ్యాపకులకు బోధించే అర్హతలున్నాయా? లేదా? అని పరిశీలించాకే గుర్తింపును జారీచేయాలి. ఈ నేపథ్యంలోనే కాలేజీలు కన్సల్టెన్సీలను రంగంలోకి దింపి ఆశావహులకు వల వేస్తున్నాయి. బయోమెట్రిక్ హాజరు వేస్తే నెలకు రూ.10-15 వేలు పారితోషికంగా ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకోవాలి
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై జేఎన్టీయూ అధికారులు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రత్యేక బృందాలను నియమించి తనిఖీలు నిర్వహించాలి. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండా నడుస్తున్న కాలేజీలపై నిఘాపెట్టాలి. జేఎన్టీయూతో పాటు, ఓయూ పరిధిలోనూ ఇలా కొన్ని కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలి.
– అయినేని సంతోష్ కుమార్,టీఎస్టీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు