‘స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో మా (దళితుల) సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కోసం ప్రయత్నం చేసిన వారు లేరు. కానీ సీఎం కేసీఆర్ అడగకముందే ‘దళితబంధు’ ఇచ్చారు. ఆయన దయ వల్ల మా కుటుంబం ఆత్మగౌరవంతో బతుకుతున్నది’ అని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన లబ్ధిదారు లావణ్య చెప్పింది. గ్రామంలోని 76 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయగా, రూ.10 లక్షలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈమె కూలీ నుంచి వ్యాపారిగా మారింది.
దళితబంధు సాయం పొందేముందు దాకా.. బొల్లారం దశరథం, లావణ్య దంపతులిద్దరూ కూలీలే. దశరథం పొద్దున 5 గంటలకే హైదరాబాద్కు వెళ్లి కూలీ పని చేసి ఇంటికి వచ్చే సరికి అర్ధరాత్రి అయ్యేది. రోజంతా కష్టడితే రూ.500 కూలి వచ్చేది. లావణ్య కూడా స్థానికంగా కూలీ పనులకు వెళ్లేది. ఆమె సంపాదన రోజుకు రూ.300. వీరికి ఇద్దరు పిల్లలు. దినదినగండంగా సాగుతున్న వీరి జీవితంలో ‘దళితబంధు’ పథకం కొత్త వెలుగులు తెచ్చింది. దీపం వత్తులు తయారు చేసే యూనిట్ను ఎంపిక చేసుకొని నెలకు రూ.30 వేల వరకు లావణ్య సంపాదిస్తున్నది. రూ.2 లక్షలతో రెండు బర్రెలను కొనుగోలు చేసి, పాలను స్థానిక చిల్లింగ్ సెంటర్లో అమ్మి నెలకు రూ.4-5 వేలకు సంపాదిస్తూ లావణ్య భర్త దశరథం ఉపాధి పొందుతున్నాడు. రూ.60 వేలతో బోరు వేయగా నీళ్లు పుష్కలంగా పడ్డాయి. సేద్యం చేసేందుకు రూ.1.50 లక్షలతో పొలం అచ్చు కట్టుకున్నారు.
మిగిలిన డబ్బులతో మరో రెండు బర్రెలు కొని పాల వ్యాపారాన్ని మరింతగా పెంచుకొంటామని ఈ దంపతులు అంటున్నారు. ‘అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అట్లాంటిది సీఎం కేసీఆర్ మా దళితుల బాధలను అర్థం చేసుకుని మా జీవితాలను బాగు చేసేందుకు దళితబంధుతో ఆదుకుంటున్నరు. కూలీ పనులతో కష్టపడ్డ మేము ఇప్పుడు ఇంట్లోనే ఉండి గౌరవంగా బతుకుతున్నం. దీపం వత్తులు తయారుచేసే యూనిట్ను పెట్టుకుంటానంటే సార్లు గూడ సరేనన్నరు. రూ.1.72 లక్షలు పెట్టి రెండు మిషన్లు కొనిచ్చినరు. మల్కాజ్గిరి నుంచి ఓ సేట్ వచ్చి వత్తులను కొంటున్నరు. పెట్టుబడి లేదు. సరుకులను సేటే ఇస్తున్నరు. రోజుకు 2 కిలోల వత్తులు తయారు చేస్తున్న. కిలోకు రూ.600 ఇస్తున్నరు. గత నెల రూ.30 వేలు వచ్చింది. కేసీఆర్ సారే ఇల్లు కట్టిస్త అంటున్నరు. మేం సంపాదించినది పిల్లల కోసం దాచి బాగా చదివించుకుంటం. మా జీవితం ఇంత బాగుంటదని కలలో కూడా అనుకోలే’ అని లావణ్య సంబురంతో చెప్పింది.