ఉస్మానియా యూనివర్సిటీ: త్వరలో జరుగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా అందజేస్తామని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్గౌడ్ అన్నారు. విద్యార్థులు, యువకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్న కేసీఆర్కు తామంతా రుణ పడి ఉంటామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్హౌజ్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిరణ్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన కేసీఆర్ మరో విద్యార్థి నాయ కుడు, బడుగు, బలహీనవర్గాల ముద్దుబిడ్డ గెల్లు శ్రీనివాస్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం హర్షనీయమన్నారు.
పార్టీని నమ్ముకున్న ఉద్యమకారులకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని మరోసారి స్పష్టమైందని అన్నారు. గత పాలకులు విద్యార్థి నాయకులను రాజకీయాలకు వాడుకుని, బీఫామ్లు సైతం ఇచ్చి వెనక్కి తీసుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు. కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎందరో విద్యార్థి నాయకులకు సముచిత స్థానాన్ని కల్పించడంతో పాటు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించి, వారిని భావితరం నాయకులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కేసీఆర్ సొంతమని కొనియాడారు. పార్టీకి విధేయంగా ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని మరోసారి నిరూపితమైందని అభిప్రాయపడ్డారు.
సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకున్న సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థిని గుర్తించి చట్టసభకు వెళ్లే అవకాశం కల్పించారని ప్రశంసించారు. ఈ పోరును వందల కోట్లు ఉన్న నయా పెత్తందారుకు, వంద కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపిన నిరుపేద విద్యార్థికి జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. రెండు వందల ఎకరాలు కబ్జా చేసిన వ్యక్తికి రెండు గుంటలు ఉన్న ఉద్యమకారుడికి జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజలు తగిన ఫలితం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈటెలకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. విద్యార్థి నాయకుడు, బడుగు బలహీన వర్గాల బిడ్డను బానిస బిడ్డగా సంబోధించిన ఈటెలకు తగిన గుణపాఠం చెప్పబోయే సమయం దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు.
నిజాయితీ కలిగిన విద్యార్థి నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడడం ఈటెల దొర రాజకీయాలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. విద్యార్థి నాయకునిపై కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుని గెల్లును అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి, యువకుడిపై ఉందని అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లను మట్టికరిపించి, గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు స్వామియాదవ్, కొండ శ్రీమాన్, ప్రదీప్ పటేల్, భరత్కుమార్, ఉపేందర్నాయక్, శివపటేల్, మధు, నాగరాజుగౌడ్, నరేశ్, బ్రహ్మం, శ్రీకాంత్, నాని తదితరులు పాల్గొన్నారు.