హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పశువులకు కృత్రిమ గర్భధారణ(ఏఐ)లో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచింది. ఇప్పటివరకు పాడి సంపదకు కేరాఫ్ అయిన గుజరాత్, ఏపీని వెనుకకు నెట్టి తెలంగాణ ముందు వరుసలో నిలవడం గమనార్హం. రాష్ట్రంలో పాడి సంపదను అభివృద్ధి చేయడంలో భా గంగా రాష్ట్ర పశు సంవర్ధకశాఖలోని పశు గణాభివృద్ధి సం స్థ గత మూడేండ్లుగా విస్తృతంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇందులో భాగంగానే 2018-19 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల ఆవులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ జరిపారు. దీని ఫలితంగా రాష్ట్రంలో గత మూడున్నరేండ్లలో సుమారు 19.3 లక్షల మేలురకపు దూడలు జన్మించాయి.
పశువుల వీర్యం ఎగుమతి
కరీంనగర్లోని పరిశోధన కేంద్రంలో ఏఐకి అవసరమైన వీర్యాన్ని మేలురకపు 76 కోడెలు, దున్నపోతుల నుంచి సేకరిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి పశువుల వీర్యం దిగుమతి చేసుకునే పరిస్థితి పోయి ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగడం గమనార్హం. ఈ కృత్రిమ గర్భధారణలోనే కచ్చితంగా దూడపిల్లనే పుట్టేలా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
గోపాలమిత్రుల విన్నపం
కృత్రిమగర్భదారణలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలుపడంలో రాష్ట్రంలోని సుమారు 1350 మంది గోపాలమిత్రుల కృషి వెలలేనిది. పాడి సంపద అభివృద్ధికి కృషిచేస్తున్న తమకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.8500 వేతనాన్ని మరికొంత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో తమను కూడా భాగస్వామ్యం చేయాలని విన్నవించారు.