ఈ విభాగంలో రాష్ట్రంలోని 13,737 గ్రామాలు
దేశం మొత్తంలో తెలంగాణకు చెందినవే 52 శాతం
దేశానికి ఆదర్శంగా నిలిచిన మన పల్లె సీమలు
పల్లె ప్రగతి ద్వారానే ఇది సాకారం: ఎర్రబెల్లి
పంచాయతీరాజ్ సిబ్బందికి మంత్రి అభినందనలు
హైదరాబాద్, జనవరి 1 : రాష్ట్రంలోని దాదాపు గ్రామాలన్నీ బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ విభాగంలో చేరాయి. రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలను (96.74 శాతం) ఓడీఎఫ్ ప్లస్గా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వసతులు, మౌలిక సదుపాయాలతో తెలంగాణ పల్లెలు దేశంలో ముందువరుసలో నిలిచాయి. ఇటీవల ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేయడానికి కేంద్రం అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను అప్లోడ్ చేశారు. ఆ వివరాల ప్రకారం రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్గా నిలిచాయి. దేశంలో మొత్తం 5,82,903 గ్రామాలు ఉంటే 26,138 గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ ప్లస్ పరిధిలోకి వచ్చాయి. వాటిలో తెలంగాణకు సంబంధించినవే 13,737 (52శాతం) గ్రామాలు ఉన్నాయి.
ఓడీఎఫ్ ప్లస్ అంటే…
కేవలం మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్గా ప్రకటిస్తారు. ఆ తరువాతి దశ అయిన ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లో తడి పొడి చెత్తగా వేరు చేయడం, ప్రతి గ్రామానికి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్ సమకూర్చడం, శ్మశాన వాటికను నిర్మించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి.
పల్లె ప్రగతి ద్వారానే సాధ్యమైంది.. మంత్రి దయాకర్రావు
రాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ పరిధిలోకి రావడం సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి ద్వారానే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై దేశానికి ఆదర్శంగా నిలిచిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సిబ్బందికి, అధికారులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.