కొవిడ్ మార్గదర్శకాలతోనే కొత్త ఏడాది సంబురాలు
పబ్బులు, ఇతర వేడుకలచోట్ల ఆంక్షలు ఉండాల్సిందే
పోలీసుల స్పందన ఊహించినదాని కంటే బాగుంది
హైకోర్టు ప్రశంస.. ఆంక్షలు అమలుచేయాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 30: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించటాన్ని హైకోర్టు సమర్థించింది. మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. పబ్బుల నిర్వహణకంటే కొవిడ్ వైరస్ను నియంత్రించటమే అత్యంత ముఖ్యమని అభిప్రాయపడింది. హైదరాబాద్లో పబ్బుల వల్ల శబ్దకాలుష్యం, పారింగ్, ట్రాఫిక్ సమస్యలతో సతమతం అవుతున్నామని జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ నిర్వహించారు. కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలకు సంబంధించి మీడియాలో వచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటనను ప్రస్తావించిన ధర్మాసనం, పోలీసులు ఈసారి బాగా స్పందించారని కొనియాడింది. వేడుకలకు మైనర్లను అనుమతించకూడదని, సంగీత శబ్దం 45 డెసిబెల్స్ మించరాదని, బహిరంగ ప్రదేశాల్లో డీజేలను అనుమతించరాదని, రోడ్లపై వాహనాలు పార్క్ చేయకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.
ఊహించని స్పందన ఇది
పబ్బులవల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటుచేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. పబ్బులవల్ల ఎదురవుతున్న సమస్యలకు సంబంధించిన వీడియోలు పంపేందుకు పోలీసులు ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంట్ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్రెడ్డి, సమస్యలు తెలిపేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ అవసరంలేదని, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వాహనాల పారింగ్ విషయంలో కూడా పబ్బుల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించారని గుర్తుచేశారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎక్సైజ్శాఖ స్పందించాల్సి ఉన్నదని, కానీ పిటిషనర్ ఆ శాఖను ప్రతివాదిగా చేర్చలేదని తెలిపారు. ఈ సందర్భంలో కల్పించుకొన్న ధర్మాసనం, ఎక్సైజ్శాఖను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. కరోనా నియంత్రణపై ఎవరూ ఊహించనిస్థాయిలో పోలీసులు స్పందించారని, దీనిని అందరూ స్వాగతించాలని అన్నారు. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వేశారు.
మాస్క్ ధరించని 58,578 మందిపై కేసులు
హైదరాబాద్లో 14,596 మందిపై నమోదు
హైదరాబాద్ నగరంతోపాటు అన్ని జిల్లాలు, పట్టణాల్లో మాస్క్ నిబంధనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా మాస్క్ పెట్టుకోని 58,578 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14,596 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6,754, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 7,011 మందిపై కేసులు నమోదుచేసినట్టు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లేనివారిని సీసీటీవీ పుటేజీ ఆధారంగా, పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది ప్రత్యక్షంగా గుర్తిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.