కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా తేల్చండి
గోదావరిపై 6 ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించండి
గెజిట్ నుంచి ఐదు ప్రాజెక్టులను తొలగించండి
జీఆర్ఎంబీ అవసరమే లేదు
కేంద్ర జలశక్తిశాఖకు స్పష్టం చేసిన సీఎస్ సోమేశ్కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 28 : అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం సత్వరమే ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కేంద్రాన్ని కోరారు. గోదావరి బేసిన్కు సంబంధించి ఇప్పటికే అందజేసిన ఆరు డీపీఆర్లను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికారాల పరిధులను నిర్దేశిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ జనవరి 15 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. గోదావరి బేసిన్లోని సీతారామ లిఫ్ట్ స్కీమ్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు(తుపాకులగూడెం), చనాకా కొరాట బరాజ్, ముక్తేశ్వరం(చిన్నకాళేశ్వరం), చౌటుపల్లి హనుమంతరెడ్డి, మోడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించాలని కోరారు. గోదావరి బేసిన్లోని రామప్ప-పాకాల లింక్ ప్రాజెక్టు, కందకుర్తి లిఫ్ట్ స్కీమ్లు సీడబ్ల్యూసీ అప్రయిజల్ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు కంతనపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం ఉనికిలోనే లేదని వివరించారు. కడెం ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయిన కారణంగా ఆయకట్టుకు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నీరు అందిస్తున్నామని తెలిపారు. ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ను నిర్మించినందున అనుమతులు అక్కర్లేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీకి సంబంధించి ప్రాజెక్టుకు కేటాయించిన 195 టీఎంసీల జలాలను 120 రోజుల్లో కాకుండా 80-90 రోజుల వ్యవధిలోనే తరలించుకొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని, అదనంగా నీటిని తరలించుకొనేందుకు కాదని స్పష్టంచేశారు. అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను అడ్డుకోవాలని కోరారు.
నిధులు ఎందుకో స్పష్టతనివ్వండి
గోదావరిపై తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేవనీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డే అవసరం లేదని సోమేశ్కుమార్ ఖరాకండిగా తేల్చిచెప్పారు. ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా ఆపరేషనల్ ప్రొటోకాల్ను రూపొందించిన తరువాతనే కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని స్పష్టంచేశారు. రివర్ బోర్డులకు చెల్లించే నిధులను ఎందుకు? ఎలా వినియోగిస్తారో స్పష్టత ఇచ్చిన తరువాతనే వాటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.
న్యాయ సలహా అందిన వెంటనే రిఫర్ చేస్తాం
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిన ఆయా అంశాలపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ వివరణ ఇచ్చారు. ట్రిబ్యునల్ ఏర్పాటు అంశంపై కేంద్రం ఇప్పటికే న్యాయ సలహాను కోరిందని, న్యాయశాఖ అభిప్రాయం తెలియజేసిన వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర జలశక్తిశాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ, తెలంగాణ నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.