పేదోళ్ల పెద్దకొడుకుగా మారిన కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 8, (నమస్తే తెలంగాణ): భోజనం, మందులు, ఇతర చిన్నచిన్న అవసరాల నిమిత్తం ఎదుటివారి సాయం కోసం ఎదురుచూసే ఎంతోమంది వృద్ధులు ఇప్పుడు సీఎం కేసీఆర్ను తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్గా గత ప్రభుత్వం నెలకు రూ.200 మాత్రమే ఇవ్వగా దానిని టీఆర్ఎస్ సర్కార్ రూ.2,016 పెంచింది. దివ్యాంగులకు ఏకంగా నెలకు రూ.3,016 చొప్పున అందజేస్తున్నది. ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 37,54,968 మంది ఉన్నారు. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పూర్తి వివరాలు సభకు సమర్పించారు. అందులో పేర్కొన్న ప్రకారం.
పింఛన్లు పెంచిన సర్కార్
గత ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం రూ.200 మాత్రమే ఇచ్చేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని రూ.2,016 కు పెంచింది. దివ్యాంగులకు రూ.3,016 అందజేస్తున్నది. బీడీ కార్మికులకు జీవన భృతి, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నది. ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 2014 వరకు 29,21,828 మాత్రమే ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వం అదనంగా మరో 19,61,259 మందికి పింఛన్ సౌకర్యం వర్తింపజేసింది. దీంతో ప్రస్తుతం మొత్తం లబ్ధిదారుల సంఖ్య 37,54,968కు పెరిగింది. ఆసరా పెన్షన్ పొందడానికి వయోపరిమితిని 65 నుంచి 57కు తగ్గించింది.