ముషీరాబాద్, నవంబర్ 9: బీజేపీ అరాచక ముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును వేధిస్తున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య మండిపడ్డారు. హుజూరాబాద్లో గెల్లు ఓడితే రాజీనామా చేస్తానన్నావంటూ గువ్వలను బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగదళ్ కార్యకర్తలు ఫోన్ చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. మళ్లీ ఫోన్లు చేసి ఇబ్బంది పెడితే బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని, నేతల ఇండ్లపై దాడులకు దిగుతామని హెచ్చరించారు.
మంగళవారం విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్, ఈటల, వారి అనుచరులు దళిత ఎమ్మెల్యేను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న కిషన్రెడ్డి, పసుపుబోర్డు తేకపోతే రాజీనామా చేస్తానన్న ఎంపీ అరవింద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండిపోతే బండి ఇస్తామన్న బండి సంజయ్ ముందుగా తమ మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.